NEET Protest Victory: 'స్టూడెంట్ పవర్‌ అంటే ఇదే'... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బాలీవుడ్ క్రేజీ రియాక్షన్స్!

NEET Protest Victory: 'స్టూడెంట్ పవర్‌ అంటే ఇదే'... ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బాలీవుడ్ క్రేజీ రియాక్షన్స్!

NEET పేపర్ లీక్, పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రాజకీయ పార్టీలతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా ఊహించని మద్దతు లభించింది. రోజురోజుకూ మిన్నంటిన విద్యార్థుల నిరసనలు, జంతర్ మంతర్ వద్ద హోరెత్తిన ధర్నాలతో చివరికి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..

గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తీవ్ర విచారానికి గురయ్యానంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన రాజీనామా లేఖను సమర్పించారు. మంత్రి రాజీనామా వార్త బయటకు రావడమే ఆలస్యం.. దేశవ్యాప్తంగా విద్యార్థులు సంబరాల్లో మునిగిపోగా, బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్టూడెంట్ పవర్‌ను కొనియాడారు..

స్టూడెంట్ పవర్‌ అంటే ఇదే..

ఈ పరిణామాన్ని విద్యార్థుల పోరాటానికి లభించిన విజయంగా అభివర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర మంత్రి రాజీనామాపై నటుడు విజయ్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ ఫొటోను షేర్ చేస్తూ.. 'అచ్చా చల్తా హూన్... దువావోం మే యాద్ రఖ్నా' అంటూ 'ఏ దిల్ హై ముష్కిల్'చిత్రంలోని పాట లైన్‌ను ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Varma (@itsvijayvarma)

 

హాట్సాఫ్ మై డియర్ కాక్రోచెస్.

నటి ప్రియాంక చోప్రా జోనస్ కూడా ఈ పరిణామంపై స్పందించారు. జర్నలిస్ట్ ఫయే డిసౌజా చేసిన పోస్టుకు క్లాప్, సెలబ్రేషన్, రెడ్ హార్ట్ ఎమోజీలతో తన మద్దతును తెలిపారు. మరోవైపు నటుడు ప్రకాష్ రాజ్ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటూ విద్యార్థులకు అండగా నిలిచారు. విద్యార్థులు, ఉద్యమకారులను అభినందిస్తూ బలమైన వ్యాఖ్యలు చేశారు. 'అభినందనలు మై డియర్ కాక్రోచెస్.. సోనమ్ వాంగ్‌చుక్ సర్, విద్యార్థుల వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ హాట్సాఫ్. ఒక వ్యవస్థను మోకాళ్లపైకి ఎలా తెప్పించవచ్చో మీరు నిరూపించారు' అంటూ  ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ పంచ్ విసిరారు.

 

వీర్ దాస్ ఎమోషనల్..

కమెడియన్ వీర్ దాస్ విద్యార్థులను అభినందిస్తూ..వారి పోరాటం ప్రజాస్వామ్యంలో యువ శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు.  'మనం చిన్నప్పుడు బడిలో చదివి మరిచిపోయిన ఒక మాటను ఈ రోజు మీ పోరాటంతో మళ్లీ గుర్తుచేశారు. గ్రేట్ జాబ్ కిడ్స్!' అంటూ ప్రశంసించారు. రచయిత, కమెడియన్ వరుణ్ గ్రోవర్ కూడా విద్యార్థుల ఐక్యతను ప్రశంసిస్తూ, ఈ ఉద్యమంలో యువత పాత్రను కొనియాడారు.

నటుడు అభిషేక్ బెనర్జీ తన సోషల్ మీడియా డీపీ మార్చి జెన్-జెడ్ ఉద్యమానికి అభినందనలు తెలిపారు. స్వర భాస్కర్, సబా ఆజాద్, పార్వతి తిరువోతు, సోనాక్షి సిన్హా, విక్రమాదిత్య మోత్వానే, ట్వింకిల్ ఖన్నా తదితరులు కూడా తమ స్పందనలు తెలియజేశారు.

 

ఐక్యతతో అతిపెద్ద విజయం..

NEET సహా పలు పోటీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ జూన్ 20 నుంచి జంతర్ మంతర్‌లో ప్రారంభమైన నిరసనలు దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. విద్యార్థులు పారదర్శకత, బాధ్యతాయుతమైన పరీక్షా వ్యవస్థ కోసం డిమాండ్ చేశారు. ఈ పోరాటంపై పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ వాడినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు..

ఇటీవల ఢిల్లీలో పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో సినీ ప్రముఖులు కూడా ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. చివరికి తమ ఐక్యతతో విజయం సాధించి 'స్టూడెంట్స్ తో పెట్టుకుంటే అంతే మరి!'అని నిరూపించారు.  నిజంగా ఇది ఐక్యతకు దక్కిన అతిపెద్ద విజయంగా విద్యార్థులను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం రాజకీయంగానే కాకుండా విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షా వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది.