విశాఖలో భూమాఫియాపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. విశాఖలో భూముల యజమానులు తీవ్రంగా భయపడుతున్నారని, తమ పార్టీ కార్యాలయం పక్కన ఉన్న స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారన్నారు. ఓ పార్టీకి చెందిన నేతలు గన్స్ గురిపెట్టి మరీ భూకబ్జాలకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారని కన్నా ఆరోపించారు. ఇటీవల తన భూమిని కూడా కబ్జా చేయబోయారని చెప్పారు.
1993లో భీమిలి సమీపంలోని చేపలుప్పాడులో తాను భూమి కొనుగోలు చేశానని, ఇటీవల ఆ భూమిని కొంతమంది కబ్జా చేయడానికి యత్నించారని ఆరోపించారు. తన స్థలం పక్కనే ఉన్న ఓ పోలీస్ అధికారి స్థలాన్ని కూడా కబ్జా చేయబోయారని కన్నా అన్నారు. ఆ పోలీస్ అధికారి తనకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో.. తన మనుషుల్ని పంపించినట్టు చెప్పారు. వాళ్లు వెళ్లేసరికి తన స్థలానికి కంచె కూడా వేసేశారని అన్నారు. ఇది కన్నా గారి ల్యాండ్ అని తన మనుషులు చెప్పడంతో.. ఆయనదని తెలియక ఫెన్సింగ్ వేసినట్టు చెప్పారన్నారు.