‘కొరియన్ కనకరాజు’ చిత్రానికి తాము ఊహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వచ్చిందని టీమ్ చెబుతోంది. వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకొస్తున్న రెస్పాన్స్ తెలియజేసేందుకు టీమ్ ప్రెస్మీట్ నిర్వహించింది.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘ప్రీమియర్స్ నుంచి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. మొదటి నుంచి ఈ సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆడియన్స్ సినిమాలోని ప్రతి ఎపిసోడ్ను ఎంజాయ్ చేస్తున్నారు. సత్య కామెడీకి మరింత రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలని ఈ సినిమా చేశాం. ఇప్పుడు థియేటర్లలో వాళ్లు అలా ఎంజాయ్ చేస్తుంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది.
బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు మరింత స్పెషల్గా అనిపిస్తోంది’ అని చెప్పాడు. ఈ సక్సెస్లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా అని రితికా నాయక్ చెప్పింది. తనకు కావాల్సిన హిట్ ఈ సినిమా రూపంలో వచ్చిందని దర్శకుడు మేర్లపాక గాంధీ అన్నాడు. చాలా రోజుల తర్వాత తమకు పెద్ద విజయం దక్కిందని, థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు చూడటం చాలా సంతోషంగా ఉందని నిర్మాత రాజీవ్ రెడ్డి అన్నారు.
