‘డబ్బు, ఆదాయం, ఖర్చు, పొదుపు,..’ మనిషి నిత్య జీవితంతో ముడిపడిన పదాలు. గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అది మనిషిపై, మనీపై పడడం సాధారణమైంది. ఫలితంగా ద్రవ్యోల్బణం, స్టాక్ ఎక్స్ఛేంజ్, సెన్సెక్స్, ఆర్థిక మాంద్యం.. వంటివి పేదలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. కానీ, వీటిని అర్థం చేసుకోవడం, భవిష్యత్ను భద్రంగా నిర్మించుకోవడం అంత సులభం కాదు. ఈ క్రమంలో ‘దేశ ఆర్థికాభివృద్ధికి మన ముందు తరం ఏం చేసింది? రాబోయే కాలంలో మనమేం చేయాలి?’ అనే విషయాలను ‘ది ఇండియా స్టోరీ’ పుస్తకం ద్వారా చెప్పాడు రచయిత బిమల్ జలాన్. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా(1981–88), రిజర్వ్ బ్యాంకు గవర్నర్(1997–2003)గా పనిచేసి రిటైరైన ఆయనకు ఆర్థిక విషయాల్లో మంచి పట్టు ఉంది. ‘ఇండియన్ ఎకానమీ’, ‘ప్రయారిటీస్ ఫర్ ది ఫ్యూచర్’, ‘ఎమర్జింగ్ ఇండియా’ పుస్తకాలు కూడా రాశాడు. ఈ మధ్య రాసిన ‘ది ఇండియా స్టోరీ’ పుస్తకంలో భారత ఆర్థిక చరిత్ర, భవిష్యత్లో ఆర్థిక భరోసాకు రాజకీయంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పాడు. ప్రధానంగా భారత ఆర్థిక రంగంలో 1991 నుంచి 2019 వరకు జరిగిన మార్పులు, పథకాలు, పాలసీలు, రాజకీయ ప్రభావాలు ప్రస్తావించాడు. ‘లెర్నింగ్ ఫ్రమ్ అవర్ ఎకనమిక్ పాస్ట్, ‘బియాండ్ ది మెట్రిక్స్ ఆఫ్ ఎకానమీ’ అనే రెండు భాగాలుగా పుస్తకాన్ని విభజించాడు. అయితే, పుస్తకంలో వాడిన చాలా పదాలు(టెర్మినాలజీ) సామాన్యులకు అంత సులభంగా అర్థం కావు. ఎకనామిక్స్ స్టూడెంట్స్, ఎకనామిస్ట్స్, బ్యాంకింగ్ సెక్టార్ అధికారులకు ఈ పుస్తకం చాలా ఉపయోగం.
పుస్తకం– ది ఇండియా స్టోరీ; యాన్ ఎపిక్ జర్నీ ఆఫ్ డెమొక్రసీ అండ్ డెవలప్మెంట్
రచయిత– బిమల్ జలాన్
ప్రతులకు– రూప పబ్లికేషన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేజీలు– 296, ధర– రూ.402/–