- కొత్త కార్లు, బైక్లతో సందడి చేయనున్న కంపెనీలు
- రెడీగా 5 ఇంటర్నేషనల్..75 లోకల్ లాంచ్లు
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం వలన వాయిదా పడిన ఆటో ఎక్స్పో ఈ వారం గ్రేటర్ నోయిడాలో ప్రారభం కానుంది. దేశంలోని కార్లు, టూ వీలర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీలు తమ ప్రొడక్ట్లను ఈ షోలో ప్రదర్శనకు ఉంచనున్నాయి. ఈ నెల 11 నుంచి 18 మధ్య జరగనున్న ఆటో ఎక్స్పోలో ఐదు ఇంటర్నేషనల్ లాంచ్లు, 75 కు పైగా ప్రొడక్ట్ లాంచ్లు ఉంటాయని అంచనా. ఈసారి ఈవెంట్ను మారుతి సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్, ఎంజీ మోటార్ ఇండియా వంటి పెద్ద కంపెనీలు ముందుండి నడిపంచనున్నాయి. ఆటో ఎక్స్పో 2022 లోనే జరగాల్సి ఉంది. కానీ, కరోనా సంక్షోభం వలన ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఈ వారం ప్రారంభం కానున్న ఆటో ఎక్స్పోలో మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఫోక్స్వ్యాగన్, నిస్సాన్, మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి కంపెనీలు పాల్గొనకపోవడం కొంత నిరాశకు గురిచేసేదే. పెద్ద కంపెనీల ఆధిపత్యం కొంత తక్కువగా ఉండనుండడంతో ఈ షోలో స్టార్టప్లు మెరిసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా స్టార్టప్ల ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఆకర్షించనున్నాయి.
పాల్గొంటున్న 80 కంపెనీలు
హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్లు ఆటో ఎక్స్పోలో టూ వీలర్ల సెగ్మెంట్ను లీడ్ చేయనున్నాయి. ఈ కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్తో నడిచే బండ్లను ప్రదర్శనకు ఉంచనున్నాయని తెలిసింది. ఫ్లెక్స్ ఫ్యూయల్ బండ్లు సాధారణ పెట్రోల్తో పాటు, ఇథనాల్ కలిపిన పెట్రోల్తోనూ నడుస్తాయి. 85 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్తో నడిచే బండ్లను ఈ టూవీలర్ కంపెనీలు ప్రదర్శనకు ఉంచనున్నాయి. ఈసారి జరగనున్న ఆటో ఎక్స్పోలో క్లీన్ టెక్నాలజీపై ఎక్కువ ఫోకస్ ఉండనుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) పేర్కొంది. హైబ్రిడ్, హైడ్రోజన్, ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ను లాంచ్ చేయడానికి, ప్రదర్శనకు సపరేట్ కౌంటర్లు ఉంటాయని పేర్కొంది. ఆటో ఇండస్ట్రీ, రిలేటెడ్ ఇండస్ట్రీల నుంచి సుమారు 80 కంపెనీలు ఈ షోలో పాల్గొంటాయని, ఇందులో 46 మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయని తెలిపింది.
ఈవీల్లో ఈ కంపెనీలు..
దేశ ఈవీ మార్కెట్లోకి రీసెంట్గా ఎంటర్ అయిన బీవైడీ ఆటో ఎక్స్పోలో పాల్గొంటోంది. దీనికి తోడు ప్రవైగ్ డైనమిక్స్, వాయువ్య్ మొబిలిటీ వంటీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలు తమ ప్రొడక్ట్లను ప్రదర్శనకు ఉంచేందుకు రెడీ అవుతున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీలయిన గ్రీవ్స్ కాటన్, టార్క్ మోటార్స్, వార్డ్విజార్డ్ ఇన్నోవేషన్స్, మోటోవాల్ట్ మొబిలిటీ, ఎల్ఎంఎల్ తమ బండ్లను ప్రదర్శనకు ఉంచనున్నాయి. ఆశోక్ లేలాండ్, వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్, జేబీఎం ఆటో, ఎస్ఎంఎల్ ఇసుజు, కమ్మిన్స్, బెనెల్లీ, కీవే, సన్ మొబిలిటీ వంటీ కంపెనీలు కూడా ఆటో ఎక్స్పోలో సందడి చేయనున్నాయి.