న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వైజరీ జారీ చేసింది. మార్నింగ్ వాక్ కోసం బయటికి వెళ్లొద్దని ప్రజలను కోరింది. గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లు, పిల్లలు, పెద్దలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎయిర్ పొల్యూషన్కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్తపడాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు పటాసులను కాల్చొద్దని చెప్పింది. ‘‘భారీ ట్రాఫిక్ ఉన్న రోడ్లు, ఇండస్ట్రీలు, నిర్మాణ/కూల్చివేత పనులు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండండి. సివియర్ ఏక్యూఐ ఉన్న రోజుల్లో ఔట్డోర్లో మార్నింగ్, ఈవెనింగ్ వాక్లు, రన్నింగ్, వ్యాయామాలు చేయొద్దు’’ అని పేర్కొంది. పొగ తాగొద్దని, క్లోజ్డ్ ఏరియాల్లో మస్కిటో కాయిల్స్, అగరబత్తులను కాల్చొద్దని చెప్పింది. అలానే కట్టెలు, ఆకులు, పంట వ్యర్థాలు, వేస్ట్ను కాల్చొద్దని సూచించింది. ‘‘శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి, కండ్లలో నీళ్లు కారడం, ఎరుపెక్కడం వంటివి ఎదురైతే డాక్టర్ను సంప్రదించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టును ఉపయోగించండి. లేదా కార్ పూలింగ్తో ప్రయాణించండి” అని చెప్పింది.
భారీగా తగ్గిన పొల్యూషన్
గురు, శుక్రవారాల్లో వాన పడటంతో శనివారం ఢిల్లీలో పొల్యూషన్ భారీగా తగ్గింది. గురువారం సగటున 437గా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. శనివారం ఉదయం 7 గంటలకల్లా 219కి పడిపోయింది. దీంతో ఎయిర్ క్వాలిటీ ‘సివియర్’, ‘వెరీ పూర్’ నుంచి.. ‘పూర్’ కేటగిరీకి వచ్చింది. ఇక గురుగ్రామ్లో 181, ఘజియాబాద్లో 157,గ్రేటర్ నోయిడాలో 131, నోయిడాలో 148, ఫరీదాబాద్లో 174 ఏక్యూఐ నమోదైంది.