బాండ్​ పేపర్​ మీద హామీ ఇస్తున్నా .. ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తా : ఆవుల రాజిరెడ్డి

బాండ్​ పేపర్​ మీద హామీ ఇస్తున్నా .. ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తా : ఆవుల రాజిరెడ్డి

నర్సాపూర్​, శివ్వంపేట, వెలుగు :  బాండ్​పేపర్​ మీద హామీ ఇస్తున్నా కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని కాంగ్రెస్​ నర్సాపూర్​ అభ్యర్థి  అభ్యర్థి  ఆవుల రాజిరెడ్డి అన్నారు. మంగళవారం ఓటర్ల ముందర బాండ్ పేపర్​ మీద సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట ఇస్తే తప్పకుండా పక్కాగా అమలు చేసే పార్టీ కాంగ్రెస్​ అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని  అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, మండలానికో స్టడీ సర్కిల్​ ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్​ ప్రలోభాలకు లొంగొద్దు

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్​ అనుకూల వాతావరణం ఉంది. దీంతో అధికార బీఆర్​ఎస్​ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది. అందువల్ల కాంగ్రెస్ శ్రేణులు రెండు రోజులు చాలా అలర్ట్​గా ఉండాలని ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. శివ్వంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 2018 ఎన్నికల సమయంలో నర్సాపూర్​ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ ఆ మాటే మరిచిపోయారని విమర్శించారు.

మళ్లీ ఇపుడు వచ్చి ఈ సారి గెలిపిస్తే నర్సాపూర్​ను బంగారు తునక చేస్తానని చెబితే నమ్మేవారు ఎవరూ లేరన్నారు. మాయ మాటలు చెప్పే బీఆర్​ఎస్​కు బుద్ధి చెప్పాలని ప్రజలు డిసైడ్​ అయ్యారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు చిలుముల సుహానిసి రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ఆంజనేయులు గౌడ్​, కరుణాకర్​ రెడ్డి, సుదర్శన్​ గౌడ్​, నవీన్​ గుప్తా, సుధీర్ రెడ్డి, శ్రీనివాస్, అశోక్​, వెంకటేశ్, రవీందర్​గౌడ్, గణేశ్​ గౌడ్, నాగేశ్, లక్ష్మీకాంతం పాల్గొన్నారు.​