కంగనా రనౌత్ హీరోయిన్గా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఇందులో ఇందిరాగాంధీ పాత్రను పోషిస్తోంది కంగన. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు. 1977 వరకూ ఇరవై ఒక్క నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితి కొనసాగింది. అలనాటి ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా ఇది. గత ఏడాది నవంబర్లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.
తాజాగా కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది జూన్ 14న విడుదల చేయబోతున్నట్టు కంగనా రనౌత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఇందిరాగాంధీ గెటప్లో పవర్ఫుల్గా కనిపిస్తోంది కంగన. తన సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని వాజ్పేయి పాత్రలో శ్రేయాస్ తల్పడే నటిస్తున్నారు. మరో కీలకపాత్రను భూమిక పోషిస్తోంది. బీజేపీని సపోర్ట్ చేసే కంగన ఈ సినిమా తెరకెక్కిస్తోంది కనుక ఇందిరాగాంధీ పాత్రను ఏ విధంగా చూపించబోతున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది.