బహుజనవాదం రాజకీయ ఉద్యమంగా మారాలె : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజనవాదం రాజకీయ ఉద్యమంగా మారాలె : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ముషీరాబాద్, వెలుగు: బహుజన వాదం బలమైన రాజకీయ ఉద్యమంగా మారాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏర్పడ్డ బంధు సొసైటీ 30వ ఆవిర్భావ దినోత్సవం శనివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయం – బహుజన చైతన్యం పేరుతో జరిగిన సమావేశంలో ప్రవీణ్ కుమార్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. 

రాజ్యాధికారంతోనే బహుజనులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి జరుగుతుందన్నారు. బహుజనుల మహనీయుల విగ్రహాలు గ్రామాల్లో ఎన్ని పెట్టినా అధికారం దక్కదన్న ఆయన.. బహుజనుల ఓట్లు వారికే వేసుకుంటేనే రాజ్యాధికారం దక్కుతుందన్నారు. ఆధిపత్య పార్టీలకు ఓట్లు వేసినంతకాలం బహుజనులు బతుకులు మారవన్నారు. కుల సంఘాల నాయకులు ఎన్నికలకు చివరలో ఆధిపత్య పార్టీలకు అమ్ముడుపోతున్నారని ఆయన విమర్శించారు. సమావేశంలో అప్పికట్ల భరత్ భూషణ్,  ప్రొఫెసర్ ముత్తయ్య పాల్గొన్నారు.