రాష్ట్రంలో బహుజన వాదం బలపడుతున్నది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో బహుజన వాదం బలపడుతున్నది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బహుజన వాదం చాప కింద నీరులా వ్యాపిస్తున్నదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని ఆధిపత్య పార్టీలకు ఓటమి తప్పదని ఆయన ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ జడ్పీటీసీ, పార్టీ సీనియర్ నేత బండారు రామ్మూర్తి గురువారం బీఎస్పీలో చేరారు. హైదరాబాద్​లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రవీణ్ కుమార్ ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, అగ్రవర్ణ పాలకులు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఓటర్లుగా మార్చి.. అధికారాన్ని వాళ్ల కబంధహస్తాల్లో పెట్టుకున్నారని ఫైర్​ అయ్యారు. రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీలకు బీఆర్ఎస్ పార్టీ కేవలం 23 సీట్లు కేటాయించిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ సైతం బీసీలను ఓటర్లుగానే  చూస్తున్నాయన్నారు. బీసీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 60 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్  పార్టీలకు బంగపాటు తప్పదని అన్నారు. పార్టీలో చేరిన వారిలో పెద్దపల్లి మాజీ జడ్పీటీసీ, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్ల కొమురయ్య, ఆరేపల్లి మధు, పెద్దపల్లి కౌన్సిలర్ పోతాను పురుషోత్తం తదితరులు ఉన్నారు.