బాలకృష్ణ బాక్సాఫీస్ స్టామినా ఏమిటో ‘అఖండ’ సినిమా మరోసారి రుజువు చేసింది. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్తో చకచకా కొత్త చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రుతీహాసన్ హీరోయిన్. జై బాలయ్య, అన్నగారు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. కొద్ది రోజులుగా కర్నూల్ జిల్లాలో షూటింగ్ జరుగుతోంది. దసరా సందర్భంగా అక్టోబర్లో మూవీని విడుదల చేయాలనుకు న్నారు నిర్మాతలు. అయితే బాలకృష్ణతో పాటు టీమ్లోని కొందరికి కొవిడ్ రావడంతో షూటింగ్ ఆలస్యమైంది. దీంతో ‘అఖండ’ రిలీజయిన డిసెంబర్ 2నే దీన్ని కూడా విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
గతంలో పలుమార్లు సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్స్ అందుకున్నారు బాలకృష్ణ. అయితే అదే సీజన్లో చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ కూడా వస్తుండడంతో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర వీళ్లిద్దరూ పోటీ పడబోతున్నారు. ఈ రెండు చిత్రాలనూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. అయితే సంక్రాంతి పెద్ద సీజన్ కనుక రెండు భారీ సినిమాలు రావడం మామూలే. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు అవార్డులు, రివార్డులు అందుకున్న బాలకృష్ణకి మరో గౌరవం దక్కింది. ప్రముఖ కవి, సాహితీవేత్త సి.నారాయణరెడ్డి జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారాన్ని ఆయన అందుకోబోతున్నారు. సినారె 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 30న రవీంద్రభారతిలో ఈ పురస్కారం అందజేయనున్నారు.