
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ
బషీర్బాగ్, వెలుగు: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధాని మోదీని సీఎం రేవంత్రెడ్డి కలవడం శుభపరిణామమని, ఎలాగైనా ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో కృష్ణా నదిని ముంచిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు గోదావరిపై పడిందని విమర్శించారు. తెలంగాణ పరివాహక ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులపై పూర్తి హక్కు తెలంగాణాకే ఉంటుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రం అండతో నిబంధనలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని ఆరోపించారు.
బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గొద్దన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు కోల జనార్ధన్ , నాగుల శ్రీనివాస్ యాదవ్, పి.సుధాకర్, నందగోపాల్, మినగాని గోపి , జక్కుల వంశీ, ఉదయ్ నేత, హరి, రజనీ తదితరులు పాల్గొన్నారు.