
- అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ
- కౌన్సెలింగ్ ఇచ్చింది: బండి సంజయ్
- సిట్ విచారణ స్టేట్మెంట్ను బయటపెట్టాలి
- ప్రభాకర్ రావు వల్ల చాలా మంది జీవితాలు
- నాశనమయ్యాయని ఫైర్
- అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చింది
కరీంనగర్, వెలుగు: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అమెరికాలోనే ప్రభా కర్ రావుకు కేసీఆర్ కుటుంబంతో కౌన్సెలింగ్ తంతు పూర్తయ్యిందని ఆరోపించారు. ‘‘ప్రభాకర్ రావు మామూలోడు కాదు. అతని వల్ల చాలా మంది జీవితాలు నాశనమయ్యాయి. నా లాంటి అనేక మంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడు”అని మండిపడ్డారు.
సోమవారం కరీంనగర్లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. సిట్విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు.. నాతోపాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన ఘనుడు. ప్రభాకర్ రావు వల్ల అనేక మంది జీవితాలు నాశనమైనయ్. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడు. ఆయనవల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకోలేని దుస్థితిని కల్పించాడు’’ అని ఆయన మండిపడ్డారు. ఎవరి ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ చేశాక ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారనే విషయాలను నిగ్గు తేలాలన్నారు. కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని,18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో విచారణ ముందుకు సాగలేదని విమర్శించారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు విన్పించాలని, ప్రభాకర్ రావు సహా ఆయన వెనకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ డిమాండ్ చేశారు.