
- నిఘా సంస్థలు మిమ్మల్ని వెంటాడ్తయ్: బండి సంజయ్
- రాష్ట్ర రాజకీయ నేతలకు కేంద్రమంత్రి హెచ్చరిక
- వచ్చే మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజం ముగుస్తది: కిషన్ రెడ్డి
- నక్సల్ ప్రభావిత జిల్లాలు 125 నుంచి 11 తగ్గాయని వెల్లడి
- మావోయిస్టులతో సంబంధాలున్న లీడర్లను విచారించాలి: రాంచందర్రావు
కరీంనగర్, వెలుగు: మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్న రాష్ట్ర రాజకీయ నాయకులు.. ఆ బంధాన్ని తెంచుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. లేని పక్షంలో వాళ్ల బండారం బయటపడడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
‘‘వేదికల మీద ప్రజాస్వామ్యాన్ని ప్రబోధిస్తూ అంతర్గతంగా సాయుధ నెట్వర్క్లకు మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు.. మీ సంబంధాలను ఇప్పటికైనా తెంచుకోండి లేదా బయటపడండి. కేంద్ర నిఘా సంస్థలు మావోయిస్టు కేడర్ వద్ద ఆగవు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో అవినీతి, నేరం, తీవ్రవాద సంబంధాలను కాపాడే వ్యవస్థ మొత్తాన్ని వెలికితీసి.. దాన్ని కఠినంగా అణచివేస్తాయి. ఈ విషయంలో ఎలాంటి దయ, కనికరం అనేది ఉండదు. మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఎంత పెద్దవారైనప్పటికీ.. దేశ భద్రత విషయంలో మావోయిస్టుల వైపు నిలబడితే కేంద్రం క్షమించదు. జాతీయ భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని సంజయ్ హెచ్చరించారు.