ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ అనేది అవాస్తవం

ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ అనేది అవాస్తవం

కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని, అందుకే చెప్పిన పంటనే వేయాలని ఆంక్షలు పెడుతోంద‌ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. 2017 నుంచి రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎక్కడ అయిందో చెప్పాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ నెంబర్‌వన్ అనేది అవాస్తవమని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు ఇంకా జరుగుతూనే ఉండగా.. ఎఫ్‌సీఐ అప్పుడే ఎలా ప్రకటన చేసిందో చెప్పాలన్నారు. ఎఫ్ సి ఐ చైర్మన్ కి కేసీఆర్ కి ఏమైనా లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. రైతులను బెదిరించి, భయపెట్టి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులకు కేసీఆర్ కారణం అవుతున్నారని మండిపడ్డారు. విత్తనాలు, ఎరువుల వల్ల రైతులు నష్టపోతే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.