స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, తెలంగాణ తొలిదశ ఉద్యమంలో నిస్వార్థంగా పని చేసిన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. తన మంత్రి పదవికి రాజీనామా చేసి బాపూజీ ఉద్యమంలో ప్రజలతో కలిసి పోరాడారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 105 జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమంలోనూ బాపూజీ క్రియాశీలకంగా పాల్గొంటూ యువతరానికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా హాజరై.. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారని చెప్పారు
బలహీన వర్గాల నుంచి బలమైన నేతగా ఎదిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడిన మహనీయుడు బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఆ మహానీయుడి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్… హామీని మర్చిపోయారని, నిజమైన తెలంగాణ ఉద్యమకారుల్ని ముఖ్యమంత్రి మర్చిపోవడం బాధాకరమని అన్నారు.