
- సంజయ్ సన్నిహితులు, సిబ్బంది ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు గుర్తింపు
- షెడ్యూల్ చూసుకొని సమయమిస్తానని చెప్పిన కేంద్ర మంత్రి
- బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాప్ అయిందని పలుసార్లు ఆరోపణలు
- వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని సంజయ్ అనుచరుడు బోయినిపల్లి ప్రవీణ్ రావుకూ పిలుపు
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఈ మేరకు శుక్రవారం ఆయనకు సమాచారం అందించింది. వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అందుబాటులో ఉండే సమయం చెప్పాలని కోరింది.
జూన్ 23 వరకు కరీంనగర్లో ఉంటానని, హైదరాబాద్కు వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తానని బండి సంజయ్ చెప్పినట్లు తెలిసింది. కాగా, కేంద్రమంత్రి హోదాలో ఉన్న సంజయ్ను పోలీస్ స్టేషన్కు పిలవకుండా.. ఆయన వద్దకే వెళ్లి వాంగ్మూలం తీసుకునేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బండి సంజయ్ టార్గెట్గా..
బీఆర్ఎస్ సర్కారు హయాంలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ టార్గెట్ గా ఆయన సన్నిహితులు, సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. బండి సంజయ్ తో పాటు ఆయన ప్రధాన అనుచరుడు, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ప్రవీణ్ రావుకు శుక్రవారం ఫోన్ చేసి విషయం చెప్పిన సిట్అధికారులు, వాంగ్మూలం ఇచ్చేందుకు హైదరాబాద్ రావాలని సూచించారు. కాగా, తనను రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా తన ఫోన్ తోపాటు తన కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేసిందంటూ బండి సంజయ్ గతంలో పలుమార్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేస్తున్న క్రమంలో తాజాగా బండి సంజయ్ ఫోన్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితుల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు పోలీసుల
విచారణలో వెల్లడైంది.
ప్రవీణ్ రావు ఫోన్పై నిఘా..
బోయినిపల్లి ప్రవీణ్ రావు మొదటి నుంచి బండి సంజయ్ వెన్నంటి ఉన్నారు. బండి సంజయ్ 3 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా, కార్పొరేటర్ గా పోటీ చేసిన సమయంలో ఆయన రాజకీయ వ్యవహారాలను ప్రవీణ్రావు చూసేవారు. గత కొన్నేళ్లుగా బండి సంజయ్ పర్సనల్ అసిస్టెంట్ గా, బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్గా కొనసాగుతున్నారు.
నియోజకవర్గ పర్యటనలు, వివిధ కార్యక్రమాల అమలు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. 317 జీవోపై ఆందోళన సమయంలో నాటి కరీంనగర్ పోలీస్ కమిషనర్, నేటి ఐజీ సత్యనారాయణ తనను హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రవీణ్ రావు గుర్తు చేశారు. ‘‘నీ ఫోన్ నీ దగ్గర ఉందనుకుంటున్నావ్. నీ జాతకం అంతా నా దగ్గర ఉంది. నువ్వు ఏమేం చేస్తున్నావో మాకు తెలుసు.
నీ అంతు చూస్తా. నీ పొలిటికల్ కెరీర్ ఖతం చేస్తా’’ అంటూ హెచ్చరించారని చెప్పారు. బండి సంజయ్ రాజకీయ కార్యక్రమాలతోపాటు నియోజకవర్గ పర్యటనలు, సభలు, సమావేశాల ఖరారు వంటి అంశాలను ప్రవీణ్ రావు పర్యవేక్షిస్తుండేవారు. దీంతో బండి సంజయ్ చేపట్టబోయే కార్యక్రమాలను ముందే నిలువరించేందుకు ఆయన ఫోన్ను ట్యాప్ చేసినట్లు తెలుస్తున్నది.