తిరుమలేశునికి వివిధ రాష్ట్రాలలో వున్న ఆస్తులను విక్రయించాలన్న టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఖండిస్తోందని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు సన్నద్ధమైన ఏపీ ప్రభుత్వం పెద్ద పాపాన్ని మూటగట్టుకుంటోందని అన్నారు. టీటీడీ ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చాలనుకున్న ఏపీ ప్రభుత్వ ఆలోచన ఏమాత్రం సరికాదని. ఆస్తుల విక్రయంపై టీటీడీ నిర్ణయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని. ఆస్తులను అమ్మాలనుకునే జగన్ సర్కారు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే శ్రీవారి భక్తులతో పాటు హిందూ బంధువలంతా సంఘటితంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనే కుతంత్రాలకు తెరతీస్తున్నారని సంజయ్ అన్నారు. హిందూ ధర్మాన్ని, హిందువుల ఆలయాలను, కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరుస్తున్న ఇలాంటి హిందూ వ్యతిరేక రాజకీయ శక్తులను.. హిందూ బంధువులు తరమికొట్టే రోజులు వస్తాయని చెప్పారు. ఇలాంటి రాజకీయ కీచకుల చెర నుంచి హిందూ ఆలయాలను రక్షించుకుంటామని, మతోన్మాదుల కుట్రలను ఎదుర్కొనేందుకు బీజేపీ పోరుబాట కొనసాగుతుందని చెప్పారు.
పాస్టర్ల జీతాల కోసమా?
వైసీపీ పాలనలో దేవుడికి, దేవుడి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని. అందుకే టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం భక్తులతో పాటు ప్రజా పక్షాన బీజేపీ పోరు కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే దాతలు ఇచ్చిన ప్రభుత్వ భూములను అమ్మేందుకు సిద్దమైన ప్రభుత్వం.. భక్తులు ఇచ్చిన కానుకలను అయినా వదిలిపెడితే అటు ప్రభుత్వానికి.. ఇటు రాష్ట్రానికి క్షేమం అని అన్నారు. టీటీడీ ఆస్తుల ఆమ్మకంతో వచ్చిన ఆదాయాన్ని చర్చిల నిర్మాణానికి పాస్టర్ల జీతాలకు ఇవ్వాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు సంజయ్. అదే నిజం అయితే ఆంధ్రప్రదేశ్ లోని దిక్కుమాలిన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో యావత్ హిందూ సమాజం భగ్గుమంటుందన్నారు. హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవాలనుకుంటే రాజకీయంగా భస్మం కాక తప్పదని హెచ్చరించారు.
టీడీపీకి పట్టిన గతే మీకూ..
వక్ఫ్ బోర్డు ఆస్తులు, చర్చిలకు సంబంధించిన భూముల గురించి పట్టని రాష్ట్ర సర్కారుకు కేవలం హిందూ దేవాలయాల ఆస్తులను కాజేయాలనే ఆలోచన పాపమని అన్నారు సంజయ్. హిందూ దేవాలయాల ఆస్తులు,ఆభరణాలు, ధనము, ఏవిధమైన స్వప్రయోజనాలకు వాడినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ దేవాలయ భూములను దుర్వినియోగం చేసి.. పాపం మూటగట్టుకున్నారన్న సంజయ్.. ఇపుడు ఆ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందేనని అన్నారు. మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ.. దేవాలయ ఆస్తులు అమ్మడానికి ప్రయత్నిస్తోందని, అదే జరిగితే తర్వాత మీ పరిస్థితి కూడా ఇంకా దారుణంగా ఉంటుందన్నారు. అందుకే టీటీడీ ఆలయాల ఆస్తుల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా వెంటనే శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని సంజయ్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.