
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ లెక్క కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో బెంగాల్ తరహా పాలనను కొనసాగించాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కాం కేసు నుంచి బిడ్డను కాపాడేందుకు రాత్రింభవళ్లు కష్టపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కొంత మంది పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కావాలనే బీజేపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని..ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు బీజేపీ కార్యకర్తలు శ్రమించాలన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గోడలపై ఉన్నారని...బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల గుండెల్లో ఉన్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలపైకి ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని..పోలీసు బందోబస్తు లేకుండా బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో తిరగాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని బండి సంజయ్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై షర్మిల చేపట్టిన నిరసనలో ఆమెకు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంపై షర్మిల తనకు ఫోన్ చేసిందని..ఆమెపై జరిగిన దాడిపై సంఘీభావం కూడా తెలిపానన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ వ్యవహారంపై పోరాడదామని షర్మిల ఫోన్ చేసి చెప్పినట్లు వివరించారు. అయితే కాంగ్రెస్తో కలిసేది లేదని తాను స్పష్టం చేశామన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా సీఎం కేసీఆర్ మార్చారని బండి సంజయ్ మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తా అని మోసం చేశారని వెల్లడించారు. రైతు బంధు ఇచ్చి రైతులకు సబ్సిడీలు తీసేశారని విమర్శించారు. ఫ్రీ యూరియా, ఫ్రీ విత్తనాలు ఇస్తా అని మోసం చేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుఖేష్ చంద్రశేఖర్ విషయం బయటకు వచ్చింది కాబట్టి..దాన్ని డైవర్ట్ చేయడానికి..కేసీఆర్ బీఆర్ఎస్ రైతు నేతలను పిలిపిచ్చుకుని సమావేశం నిర్వహించారని చురకలంటించారు.