కేసీఆర్ ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి

కేసీఆర్ ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి


ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. సోమ‌వారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన బండి సంజ‌య్.. కేసీఆర్ కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకోవాలని కూడా ప్రజలకు పిలుపు ఇవ్వడం లేదన్నారు. అంత నిర్లక్ష్యం ఎందుకో అర్థం కావడం లేదని..కరోనాపై కేటీఆర్ తో నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రజలను దోచుకోవడానికే ఉంద‌న్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులులేక కరోనా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని..ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతతో ఉన్న సిబ్బందే సేవలు చేసే పరిస్థితి ఉందన్నారు.

కేటీఆర్ తో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఆస్పత్రులను ఎందుకు సందర్శించడం లేదని ప్ర‌శ్నించారు. వసతులను ఎందుకు మెరుగుపరచడం లేద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం 61 లక్షల  41 వేల 40 డోస్ ల వ్యాక్సిన్ ను రాష్ట్రానికి ఇచ్చింది  కానీ..  రాష్ట్ర ప్రభుత్వం 54 లక్షల 47 వేల 805 డోస్ లను మాత్రమే ప్రజలకు ఇచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నాయన్నారు. మిగతా ఆరు లక్షల తొంభై మూడు వేల డోసులు ఎక్కడున్నాయని ప్ర‌శ్నించారు. ప్రజలకు వ్యాక్సిన్ ను ఎందుకు నిలిపివేశారన్న బండి సంజ‌య్.. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల‌న్నారు. 


ఎంతో క‌ష్ట‌ప‌డి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ బ్రోకర్ గా వ్యవరిస్తున్నాడ‌ని...రైతుల కష్టాలు పట్టనట్టుగా ఉంటున్న‌రన్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని..కొనుగోలు కేంద్రాలలో 40% కూడా ధాన్యం  కొనడం లేదన్నారు. మిగతా ధాన్యం వర్షాలకు తడుస్తుందని..15 రోజుల్లో దాన్యం కొనుగోలు పూర్తి చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, రైతులకు ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో బీజేపీ ఆందోళనలు చేపడుతుందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లను ఉపయోగించుకోకుండా.. తుప్పు పట్టిన తర్వాత కేంద్రాన్ని బదనాం చేయడం కరెక్ట్ కాదన్నారు.

టెస్ట్ లను, కేసులను,  మరణాలను తక్కువ చేసి చూపించి, రాష్ట్రంలో కరోనా లేదని చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడన్నారు. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్.. బరితెగించి వ్యవరిస్తున్నాడన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను కరోనా ట్రీట్మెంట్ ధరలను ప్రభుత్వము డిసైడ్ చేయాలని చెప్పారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల నుంచి దుర్మార్గంగా దోచుకుంటే.. మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు మాత్రం కరోనా పేషెంట్ లకు సేవలందిస్తున్నారని చెప్పారు బండి సంజ‌య్.