హిందువుల ఇండ్లను జీహెచ్ఎంసీ టార్గెట్ చేస్తుంది

హిందువుల ఇండ్లను జీహెచ్ఎంసీ టార్గెట్ చేస్తుంది

హిందువుల ఇండ్లను టార్గెట్ చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎంఐఎం నాయకుల జోన్లకు మినహాయింపునిచ్చి.. మిగిలిన ప్రాంతాలలో కూల్చడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరును తప్పుబడుతూ ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

‘జీహెచ్ఎంసీ అధికారులు, మేయర్ కలిపి అక్రమ కట్టడాలు కూల్చివేయాలని నిర్ణయించి కేవలం హిందువుల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ కూల్చివేతలు కొనసాగిస్తుండటం దుర్మార్గం. ఎంఐఎం శాసనసభ్యుల ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు  మినహాయింపు  ఇవ్వడం అన్యాయం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎంఐఎం శాసన సభ్యుల నియోజకవర్గాలు అంటే ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు. వీటిని మినహాయింపు ఇచ్చి  అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇది ఒక రకంగా మెజారిటీ ప్రజలపై ప్రభుత్వం చేస్తున్న దాడి. 
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూల్చివేతలు నిలిపివేయాలి. ఖైరతాబాద్ జోన్, చార్మినార్ జోన్ లో వేలాది అక్రమ నిర్మాణాలు కూల్చి వేసిన తర్వాత నే మిగతా జోన్ లలో చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం’ అని బండి సంజయ్ నోట్ విడుదల చేశారు.