కేసీఆర్ మనవడికి వయసుంటే అతనికి కూడా పదవిచ్చేవాడు

కేసీఆర్ మనవడికి వయసుంటే అతనికి కూడా పదవిచ్చేవాడు

‘కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులున్నాయ్ కానీ, ఒక్క మనవడికే లేదు. అతనికి కూడా వయసు ఉంటే పదవిచ్చే వాడు’ అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్ కాదని.. ఉద్యమకారుల వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. ‘బూతుల పురాణం, అబద్దాల మాటలు చెప్పేది కేసీఆర్, కేటీఆర్. తెలంగాణ బిల్లుకు సుష్మా స్వరాజ్ మద్దతివ్వడం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది. గ్రామీణ ఉపాధి హామీ, చెట్లు నాటడం, మరుగు దొడ్లకు, లైట్లకు, రోడ్లకు, డబుల్ బెడ్ రూమ్‌లకు.. ఇలా అనేక పథకాలకు కేంద్రం నిధులు వస్తున్నాయ్. బియ్యానికి కేంద్రం రూ.29 ఇస్తే.. కేసీఆర్ రూపాయి ఇస్తుండు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు చేయకపోవడం ద్వారా పేదలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో మూర్ఖుడైన కేసీఆర్ పాలన సాగుతుంది. ఇంటర్ విద్యార్థుల చావులకు కేసీఆరే కారణం. రాష్ట్రంలో యువకులు, రైతులు చనిపోతే కేసీఆర్ రాడు.. కానీ పెద్దోళ్ళు చనిపోతే మాత్రం పోతాడు. కేసీఆర్‌కు టోలీచౌకి తెలుసు కానీ తండాలు తెల్వదు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులున్నాయ్ కానీ, ఒక్క మనవడికే లేదు. అతనికి కూడా వయసు ఉంటే పదవిచ్చే వాడు. కేసీఆర్‌కు దర్బార్ తెల్వదు.. బార్ తెలుసు. జానారెడ్డి గెలిస్తే.. టీఆర్ఎస్‌లో కలవడమే ఉంటుంది. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ మంచోడు. మీకు సేవ చేస్తడు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్లు డబ్బు పంచితే తీసుకొని బీజేపీకి ఓటెయ్యండి. నేను చెప్పినవి తప్పయితే.. నిడమనూరు చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా.. లేదంటే నీ సీఎం పదవికి నువ్వు రాజీనామా చేస్తావా?’ అని ఆయన ప్రశ్నించారు.