ఆగిన చోట నుంచే షురూ కానున్న బండి సంజయ్ పాదయాత్ర 

ఆగిన చోట నుంచే షురూ కానున్న బండి సంజయ్ పాదయాత్ర 

పాదయాత్ర నిలిపేయాలంటూ వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర  తిరిగి చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆగిన చోట నుంచే పాదయాత్ర షూరూ చేయాలని నిర్ణయించారు. రేపు ఉదయం 8 గంటలకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పామునూర్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభంకానుంది. అయితే పాదయాత్ర రూట్ మ్యాప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఎల్లుండి ఉదయం వరంగల్ భద్రకాళి గుడిలో అమ్మవారిని  బండి సంజయ్ దర్శించుకోనున్నారు. 

ఈ నెల 27న  హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. సభ జరిగే రోజు మధ్యాహ్నం వరకు పాదయాత్ర కొనసాగించనున్న బండి సంజయ్.. నేరుగా బహిరంగ సభకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ నుంచి పామునూర్ కు బయలుదేరిన బండి సంజయ్.. ఇవాళ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. మరోవైపు పాదయాత్రలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో యువత సిద్ధమయ్యారు.