మేడిపల్లి, వెలుగు : హిందువులపై దాడి చేయడమే మైనార్టీ డిక్లరేషనా..? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. ముస్లింల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్టీ మహిళలను పరామర్శించడానికి చెంగిచర్లలోని బాధితుల ఇండ్లకు బుధవారం ఆయన పార్టీ కార్యకర్తలతో వెళ్లారు. పోలీసులు వారిని అనుమతించకపోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎట్టకేలకు ఆయన బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు.
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ దాడి చేసిన వాళ్లను వదిలి, ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న వాళ్లపై హత్యాయత్నం కేసు పెడతారా..? ఇదెక్కడి న్యాయం అంటూ మండిపడ్డారు. చెంగిచర్ల నిషేధిత ప్రాంతమా..? కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి కనబడడం లేదని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని, దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిందితులను తప్పించే కుట్ర
బషీర్ బాగ్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులపై దాడులు పెరిగిపోయాయని విశ్వ హిందు పరిషత్, బజరంగ్ దళ్ నేతలు ఆరోపించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా సమావేశంలో వీహెచ్ పీ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు మాట్లాడారు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో జరిగిన ఘటనలో
దాడికి పాల్పడిన నిందితులను కాపాడే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. నిందితులను వదిలిపెట్టి, ఇతరులపై నామమాత్రంగా కేసులు పెట్టారని విమర్శించారు. ఓ వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని వారు స్పష్టం చేశారు.