- నర్సంపేట పట్టణంలో ఘటన
నర్సంపేట, వెలుగు : బిర్యానీ అయిపోయిందని చెప్పారన్న కోపంతో కొందరు యువకులు ఓ రెస్టారెంట్ పై దాడి చేసి ఫర్నీచర్, కంప్యూటర్ ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిని చితకబాదారు. ఈ ఘటన నర్సంపేట పట్టణంలో సోమవారం జరిగింది. రెస్టారెంట్ యజమాని పెండ్యాల యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని ఎంఎఫ్ సీ రెస్టారెంట్ కు శనివారం రాత్రి గిరగాని కృష్ణ, భరత్అనే యువకులు వచ్చి బిర్యానీ కావాలని అడగడంతో యాదగిరి కొడుకు రేవంత్ లేదని చెప్పాడు.
దీంతో ఇద్దరూ తిట్టుకుంటూ బయటకు వెళ్లిపోయారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణ, భరత్ తో పాటు ఆలకుంట రాజు, ఓర్సు నగేశ్, మైనోద్దీన్, పెరుమాండ్ల రాజేశ్ రెస్టారెంట్ వచ్చి రేవంత్ తో గొడవకు దిగారు. తర్వాత రెస్టారెంట్ లో కంప్యూటర్, ఫర్నీచర్ ధ్వంసం చేస్తూ, వాటర్ బాటిళ్లను కిందపడేయడంతో పాటు కిచెన్లో పనిచేస్తున్న ఇద్దరు వర్కర్లపై దాడి చేశారు. దాడిలో రూ. 20 వేల రూపాయల విలువైన కంప్యూటర్తో పాటు అద్దాలు పగిలిపోయాయని యజమాని యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
