న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను ఇండియాలో ఆడేందుకు నిరాకరిస్తూ మొండికేస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ని టోర్నీ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. తాము ఇచ్చిన డెడ్లైన్ ముగిసిపోవడంతో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ను మెగా టోర్నీలో ఆడించాలని ఇప్పటికే డిసైడైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దీనిపై శనివారం అధికారిక ప్రకటన చేయనుంది. ఫిబ్రవరి 7న మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ కోసం స్కాట్లాండ్ను ఐసీసీ ఇప్పటికే స్టాండ్బైగా ఉంచింది. భద్రతా కారణాల సాకుతో ఇండియా వెళ్లబోమని ప్రకటించిన బంగ్లాదేశ్ ఐసీసీ బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్రికెట్ కౌన్సిల్ వివాదాల పరిష్కార కమిటీ (డీఆర్సీ)ని ఆశ్రయించింది.
అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మెజారిటీతో తీసుకున్న నిర్ణయాలపై అప్పీల్ విచారించే అధికారం డీఆర్సీకి ఉండదు. ఒకవేళ డీఆర్సీ తమ అభ్యర్థనను పట్టించుకోకపోతే.. చివరి ప్రయత్నంలో భాగంగా స్విట్జర్లాండ్లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)ను ఆశ్రయించాలని బంగ్లా బోర్డు భావిస్తోంది. కానీ,కానీ అప్పటికే టోర్నీ సమయం మించిపోయే ప్రమాదం ఉంది. ఇక, అండర్ 19 వరల్డ్ కప్ మ్యాచ్లను వీక్షించేందుకు నమీబియా వెళ్లిన ఐసీసీ చైర్మన్ జై షా దుబాయ్కు తిరిగొచ్చారు. దాంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను అధికారికంగా చేర్చే ప్రక్రియ వేగవంతమైంది. దీనిపై 24 గంటల్లోనే నిర్ణయం వెలువడొచ్చు.
