మీర్పూర్: యంగ్ పేసర్ నహిద్ రాణా (5/32) ఐదు వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్తో రెండో వన్డేలో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. సోమవారం జరిగిన ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 198 రన్స్కే కుప్పకూలింది. స్లో పిచ్పై నహిద్ రాణా 144.7 కి.మీ. వేగంతో బాల్స్ వేసి కీలక వికెట్లు పడగొట్టాడు.
కివీస్ ఓపెనర్ నిక్ కెల్లీ (83) ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన బ్యాటర్లు ఎవరూ 20 రన్స్ మార్కును కూడా దాటలేకపోయారు. షోరిఫుల్ ఇస్లాం (2/32) రెండు వికెట్లు తీశాడు. అనంతరం తంజిద్ హసన్ (76), నజ్ముల్ శాంటో (50) ఫిఫ్టీలతో సత్తా చాటడంతో బంగ్లా 35.3 ఓవర్లలోనే 199/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. సిరీస్ విన్నర్ను తేల్చే మూడో, ఆఖరి వన్డే గురువారం ఛటోగ్రామ్లో జరగనుంది.

