
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో చంచల్ గూడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నిందితుడు నంద కుమార్ ను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన కేసుకు సంబంధించి ఇవాళ, రేపు (సోమ, మంగళవారాల్లో) ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఫాం హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు నంద కుమార్, రామచంద్ర భారతి, సింహయాజీలకు సీబీఐ కోర్టు వచ్చే నెల 9 వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడగించింది.
న్యాయస్థానం రిమాండ్ పొడగించడంతో ముగ్గురు నిందితులు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. దీంతో ఉదయం చంచల్ గూడ జైలుకు చేరుకున్న పోలీసులు నందును కస్టడీలోకి తీసుకున్నారు. ఫాం హౌస్ కేసుకు సంబంధించి పోలీసులు ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టే అవకాశముంది. ఇదే కేసుకు సంబంధించి నంద కుమార్ భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రెండు రోజుల పాటు అధికారులు ఆమెను ప్రశ్నించారు.