
నిర్మల్, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీలో 2025 – 26 సంవత్సరం ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించి క్లాస్లు జూన్ 4 నుంచి ప్రారంభం అవుతాయని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. బుధవారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. పీయూసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు జూన్ 16 నుంచి మొదలవుతాయన్నారు. పీయూసీ స్టూడెంట్ల కోసం ఈ సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త కోర్సుల రూపకల్పనపై దృష్టి పెట్టాలని సంబంధిత విభాగాల ఇన్చార్జులను ఆదేశించారు. జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్న బోర్డ్ ఆఫ్ స్టడీ సమావేశంలో సిలబస్ నవీకరణ, కొత్త కోర్సులపై తగిన ప్రణాళికలతో చర్చించాలని సూచించారు. రివ్యూలో ఏవో రణధీర్, అసోసియేట్ డాక్టర్ చంద్రశేఖర్, మహేశ్, విఠల్, నాగరాజు, సీవోఈ వినోద్ పాల్గొన్నారు.