
- ఆల్ పార్టీ నేతలతో ఢిల్లీ వెళ్లాలని సీఎంకు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు సూచన
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ మేధావుల ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆల్ పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేబినెట్ భేటీలో ఎన్నికలపై నిర్ణయం తీసుకోవద్దని తెలిపారు. సెక్రటేరియెట్లోని మీడియా పాయింట్లో సోమవారం ఆయన మాట్లాడారు. “బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం 18 నెలలు ఆగిన ప్రభుత్వం.. ఇంకో 18 రోజులు ఆగలేదా? వచ్చేనెల్లో పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్లపై ఎంపీలందరూ పోరాడేలా కాంగ్రెస్ కృషి చేయాలి. కులగణన, బీసీ రిజర్వేషన్ల అమలులో దేశానికే తెలంగాణ రోల్మోడల్ అని కాంగ్రెస్ చెప్పుకున్నది.
ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలా? బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత బీజేపీదే. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీలు చొరవ తీసుకోవాలి’’అని చిరంజీవులు అన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే బీసీల ఆమోదం ఉండదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ‘కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే. బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. రిజర్వేషన్ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ ఒత్తిడి పెంచాలి. ఈ పోరాటానికి బీసీ మేధావుల మద్దతు కూడగడుతాం’’అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.