- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఓయూ ప్రొఫెసర్ మనోహర్ ను అకారణంగా సస్పెండ్ చేయడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్(క్యాష్) అమలులో ప్రమోషన్ పొందని యూనివర్సిటీ లెక్చరర్ల తరఫున ఓయూ టీచర్స్ అసోసియేషన్(ఔటా) 50 రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతోందని పేర్కొన్నారు. వారికి నాయకత్వం వహిస్తున్న మనోహర్ ను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు.
టీచర్ల సమస్యలను వైస్ చాన్స్లర్, రిజిస్టార్ల దృష్టికి తీసుకుపోతే తప్పేంటని ప్రశ్నించారు. ఓయూలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యతను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, దీనికి ఆజ్యం పోసేలా యూనివర్సిటీ రిజిస్టార్ నరేశ్రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రొఫెసర్ మనోహర్ ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జాజుల హెచ్చరించారు.
