
- ఆయన రచించిన బీసీల పోరుబాట పుస్తకావిష్కరణ
మంచిర్యాల, వెలుగు: దశాబ్దాలుగా అన్ని రంగాల్లో అణిచివేతకు గురవుతున్న బీసీలు సంఘటితమైతేనే రాజ్యాధికారం వస్తుందని, తద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి అన్నారు. ఆయన రచించిన ‘బీసీల పోరుబాట’ పుస్తకావిష్కరణ, పుస్తక పరిచయ సభను జన అధికార సమితి ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాలలోని ఓ హాటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ.. మండల్ కమిషన్ సిఫార్సుల తర్వాత మూడున్నర దశాబ్దాల్లో కూడా ఓబీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయం జరగలేదన్నారు.
ఈ విషయంలో ఓబీసీ వర్గాల్లో చైతన్యం వచ్చిందని, రానున్న రోజుల్లో ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఓబీసీల్లో నిశ్శబ్ద విప్లవం రానుందని అన్నారు. విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు ఎలాంటి ప్రగతి సాధించారు, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన ఉద్యమాలు, బీసీల ఐకమత్యం ఆవశ్యకత తదితర అంశాలపై పుస్తకంలో వివరించినట్లు ఆయన తెలిపారు. బీసీల్లో ఐక్యత లేకపోవడం కారణంగా అధికారం అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల ఆధిపత్యం కింద బీసీలు నలిగిపోతున్నారని అన్నారు.
రానున్న రోజుల్లో ఇక్కడ బీసీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జన అధికార సమితి జిల్లా ప్రెసిడెంట్ నీలి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ చిదిరాల భావనారుషి ఆధ్వర్యంలో జరిగిన సభలో బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు కెంగర్ల మల్లయ్య, మాజీ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ, రామగుండం మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి, నాయకులు ముఖేశ్గౌడ్, నరెడ్ల శ్రీనివాస్, తులా మధుసూదన్, డాక్టర్లు పి.రమణ, రఘునందన్, కర్రె లచ్చన్న, పెట్టం లక్ష్మణ్ తదితరులు
పాల్గొన్నారు.