
బెంగళూరు సిటీలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బైక్స్ ట్యాక్సీల వల్ల మా బతుకులు దుర్భరంగా మారాయని.. ఉపాధి కోల్పోతున్నామంటూ రోడ్డెక్కారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీలతో ఆటోలకు గిరాకీ తగ్గిపోయిందని.. కుటుంబాలను పోషించటం కష్టంగా మారిందంటూ ఉద్యమిస్తున్నారు. బైక్ ట్యాక్సీలు ఎవరంటే వాళ్లు నడపకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలని.. అనధికారికంగా ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. బెంగళూరు సిటీలో ఉద్యమం మొదలుపెట్టారు ఆటో డ్రైవర్లు. బెంగళూరు నగరంలో అక్రమంగా నడుపుతున్న బైక్ ట్యాక్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో, క్యాబ్ డ్రైవర్లు గురువారం భారీ నిరసన చేపట్టారు. వీలైనంత త్వరగా ‘ఒకే నగరం, ఒకే క్యాబ్ ఛార్జీలు’ అమలు చేయాలని డ్రైవర్లు రాష్ట్ర రవాణా శాఖను కోరారు.
దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. బెంగళూరులో నడుస్తున్న అనధికార బైక్ టాక్సీలపై కఠినంగా వ్యవహరించాలని కర్ణాటక రవాణా శాఖ నిర్ణయించింది. అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (RTOలు) చట్టవిరుద్ధంగా నడుపుతున్న బైక్ టాక్సీలపై చర్య తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.