బెంగళూరు: స్నేహితుడని సాయం చేసిన ఓ స్టూడెంట్ రూ.7 కోట్ల సైబర్ ఫ్రాడ్లో చిక్కుకున్నాడు. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న 19 ఏండ్ల స్టూడెంట్.. ఏడాదిగా పరిచయం ఉన్న తన ఫ్రెండ్ ఆయుష్ మాటలు నమ్మి అతడికి బ్యాంక్ ఖాతా వివరాలు షేర్ చేశాడు. ఫలితంగా అతడి అకౌంట్ ద్వారా బారీ మోసం జరిగింది.
తన బ్యాంక్ ఖాతా బ్లాక్ అయిందని, కొద్దిరోజుల కోసం అకౌంట్ను యూజ్ చేసుకుంటానని ఆయుష్ అడగగానే, ఇంజనీరింగ్ స్టూడెంట్ అతడి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఏటీఎం కార్డు, నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్వర్డ్స్ అన్నీ ఇచ్చేశాడు. కొన్ని నెలల తర్వాత బ్యాంక్ అధికారులు సదరు స్టూడెంట్ను సంప్రదించి అతడి అకౌంట్ నుంచి అనుమానాస్పదంగా లావాదేవీలు జరిగాయని నోటీసులు ఇచ్చారు.
అతడి అకౌంట్ నుంచి రెండ్రోజుల్లోనే దాదాపు రూ.7 కోట్ల నగదు బదిలీ అయిందని, మ్యూల్ అకౌంట్ కింద ఆ ఖాతా నుంచి నేరస్థులకు డబ్బు ట్రాన్స్ఫర్ అయిందని పోలీసులు తెలిపారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన విద్యార్థి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారీలో ఉన్న ఆయుష్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.
