బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంపై అయోమయం .. మూడేళ్లుగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంపై  అయోమయం .. మూడేళ్లుగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్
  • బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాల ఆందోళన
  • ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది స్టూడెంట్స్ కు లబ్ధి
  • పాత స్టూడెంట్లను స్కూళ్లకు రావద్దని చెప్పడంతో చదువులో వెనకబడిపోతారంటున్న పేరెంట్స్

ఆదిలాబాద్, వెలుగు: బెస్ట్  అవైలబుల్ స్కూల్​  స్కీంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్  స్కూళ్లలో ఉచిత విద్యతో పాటు వసతి సదుపాయం కల్పిస్తోంది. డే స్కాలర్​కు రూ.28 వేలు, రెసిడెన్షియల్​ స్టూడెంట్​​కు రూ.42 వేల చొప్పున ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 180 ప్రైవేట్  స్కూళ్లలో 26 వేల మంది బీఏఎస్​ కింద చదువుతుండగా, వారికి సంబంధించిన వందల కోట్ల బిల్లులు పెడింగ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. 

మూడేళ్లుగా ఈ స్కీంకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్కూల్​ యాజమాన్యాలు వాపోతున్నాయి. స్కూళ్లు రీ ఓపెన్​ కావడంతో ఇకనైనా బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్కూళ్లలో చదువుకుంటున్న వారిని రావద్దని కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు చెబుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా ఈ పథకం కింద విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, చాలా జిల్లాల్లో ఇంకా లక్కీ డ్రాలు నిర్వహించలేదు. బడులు తెరిచి ఐదు రోజులు గడస్తున్నా బెస్ట్  అవైలబుల్  స్కూళ్లలో అడ్మిషన్లపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. 

రూ. 200 కోట్లు పెండింగ్..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్  ఇంగ్లీష్‍ మీడియం పాఠశాలల్లో ప్రతి ఏడాది బెస్ట్  అవైలబుల్ స్కూల్​ స్కీం కింద విద్యార్థులను చేర్చుకుంటారు. జిల్లాల వారీగా 1వ తరగతి, 5వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. 1 నుంచి 5వ తరగతి వరకు నాన్  రెసిడెన్షియల్, 5వ తరగతి నుంచి 10వ తరగతి 
విద్యార్థులకు రెసిడెన్షియల్  స్కూళ్లలో అవకాశం ఇస్తారు. 

గ్రామీణ ప్రాంతంలో పేరెంట్స్​ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. ప్రతి ఏడాది 
ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. డే స్కాలర్  కింద రూ. 28 వేలు, రెసిడెన్షియల్ కు రూ.42 వేలు ఫీజుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. మూడేళ్లుగా ఈ ఫీజులు చెల్లించకపోవడంతో తమపై ఆర్థిక భారం పడుతోందని, పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకోలేమని స్కూల్​ యాజమాన్యాలు తేల్చిచెబుతున్నారు.  ​

మేం చెప్పేంత వరకు ఆగండి..

బెస్ట్  అవైలబుల్ స్కూల్​ స్కీం కింద ప్రైవేట్  పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఆయా జిల్లాల్లో కలెక్టర్  దరఖాస్తులు ఆహ్వానించారు. ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా, లక్కీ డ్రా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్  పాఠశాల యాజమాన్యాలు తమకు రావాల్సిన పెండింగ్  బిల్లులు ప్రభుత్వం చెల్లించేంత వరకు విద్యార్థులను చేర్చుకోవద్దని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్కీం కింద రెసిడెన్షియల్​లో చదువుతున్న పాత విద్యార్థులను తాము చెప్పేంత వరకు స్కూల్ కు రావద్దని యాజమాన్యాలు చెబుతున్నట్లు తెలిసింది.

 డే స్కాలర్  విద్యార్థులు రూ. వెయ్యి ఫీజు చెల్లించిన తర్వాతే క్లాసులకు రావాలని కొన్ని ప్రైవేట్  పాఠశాలల యాజమాన్యాలు పేరెంట్స్​కు చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి పెండింగ్  బిల్లులు రాకుంటే తమ పిల్లలు చదువులో వెనుకబడిపోతారని పేరెంట్స్  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్కూల్​ యాజమాన్యాలతో చర్చించి విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పేరెంట్స్​ కోరుతున్నారు.

పెండింగ్ బిల్లులు చెల్లించాలి..

బెస్ట్  అవైలబుల్  స్కీం కింద ప్రతి ఏడాది పేద విద్యార్థులను చేర్పించుకుంటున్నాం. మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి ఫీజులు విడుదల కావడం లేదు. తక్కువ ఫీజుతో చదువు, భోజనం, పుస్తకాలు, దుస్తులు, వసతి కల్పిస్తున్నాం, ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే పెండింగ్  బిల్లులు చెల్లించాలి.

వేద వ్యాస్, కరస్పాండెంట్, ప్రగతి ప్రైవేట్  స్కూల్, ఆదిలాబాద్