
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
సుజాతనగర్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయం లో లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, డిజిటల్ విద్య , ఉపకార వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.
మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించి వాటి రిపేర్లను పూర్తి చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు మట్టి ఇటుకలతో ప్రహరీ గోడల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
ప్రతి పాఠశాలలో తులసి, చింత, ఉసిరి, వెలగ, మునగ, కరివేపాకు మొక్కలను నాటాలని సూచించారు. అజోల్ల, బయోచార్, కంపోస్ట్ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతల నిర్మాణం, ఫామ్ పౌండ్స్ నిర్మాణం లాంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, సీపీవో సంజీవరావు, మెప్మా పీడీ రాజేశ్, డీఈవో ఎం. వెంకటేశ్వరాచారి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇందిర, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.