
తన మొదటి సినిమానే మాస్ హీరో రవితేజతో నటించడం సంతోషంగా ఉందని చెప్పింది భాగ్యశ్రీ బోర్సే. ఆమె హీరోయిన్గా హరీష్ శంకర్ రూపొందించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే చెప్పిన విశేషాలు.
‘‘నా మొదటి సినిమా రవితేజ గారితో వర్క్ చేయడం ఎక్సయిటింగ్గా అనిపించింది. ఇందులో నా పాత్ర పేరు జిక్కీ. తను మార్వాడి గర్ల్. బచ్చన్ లైఫ్లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నైంటీస్ బ్యాక్డ్రాప్లో నడిచే కథ అవడంతో వింటేజ్ లుక్లో కనిపిస్తాం. తెలుగులో తొలి చిత్రమైనా నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పా. మొదట్లో కాస్త కష్టం అనిపించింది. అయితే టీమ్ సపోర్ట్తో వారం రోజుల్లో డబ్బింగ్ ఫినిష్ చేశా. రవితేజ గారు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఇప్పటికీ ఆయన కొత్త వారిలానే ఉంటారు. సెట్కి టైమ్కి వస్తారు. ఎవరికీ ట్రబుల్ ఇవ్వరు.
మనం ఏ స్టేజ్లో ఉన్నా మన క్రాఫ్ట్కి గౌరవం ఇవ్వాలని ఆయన్ని చూసి నేర్చుకున్నా. హరీష్ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ ఎక్స్పీరియెన్స్. ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ విన్నా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో వర్క్ చేయడం కంఫర్ట్బుల్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియెన్స్. ఇక కొందరు నన్ను రష్మికలా ఉన్నానని కామెంట్ చేయడాన్ని కాంప్లిమెంట్గా తీసుకుంటా’’.