ప్రత్యేక తెలంగాణ లక్ష్యాలు నెరవేరలే: సీఎల్​పీ నేత భట్టి విక్రమార్క

ప్రత్యేక తెలంగాణ లక్ష్యాలు నెరవేరలే: సీఎల్​పీ నేత భట్టి విక్రమార్క

అచ్చంపేట, వెలుగు: నీళ్లు, నిధులు నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో ఉద్యమ కారులు, ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ ​ప్రభుత్వం నీరుగార్చిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్​మార్చ్​యాత్ర శుక్రవారం నాగర్​కర్నూల్​ జిల్లా బల్మూర్​ మండలం నర్సాయపల్లి నుంచి ప్రారంభమైంది. నర్సాయపల్లి, అనంతవరం, బల్మూర్​ల మీదుగా కొండనాగుల వరకు కొనసాగింది. మైలారం స్టేజీ దగ్గర భట్టి మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నామే తప్ప, ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు ఉద్యమ కారులపై పోలీసులు, అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు.

ఏపీ బోర్డు మారి తెలంగాణ బోర్డు వచ్చిందే తప్పా ఎలాంటి మార్పు జరగలేదన్నారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకుంటే రూ.5లక్షల కోట్ల అప్పులయ్యాయన్నారు. తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగుల ఆశలపై తెలంగాణ ప్రభుత్వం నీళ్లు చల్లిందని, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్​ప్రభుత్వంలో వారి కుటుంబం తప్పా ఏ నిరుద్యోగి, విద్యార్థుల కుటుంబాలు బాగు పడలేదన్నారు. టీ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్​ వంశీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్​రెడ్డి, వర్కింగ్​ప్రెసిడెంట్​ రాంప్రసాద్​గౌడ్​, నేతలు పదిర జంగయ్య, రమేశ్​రెడ్డి, గిరివర్ధన్​గౌడ్​, సుధాకర్​గౌడ్​, రమేశ్, సలేశ్వరం, అల్వాల్​రెడ్డి, రవీందర్​గౌడ్​, ఖదీర్​, పదిర నిరంజన్​, దర్శి శివప్రసాద్​, యాదయ్య, జగత్​రెడ్డి, ఓబుల్​రెడ్డి, వెంకట్​రెడ్డి పాల్గొన్నారు.