హైదరాబాద్: మా ప్రభుత్వ వంద రోజుల పాలన పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14కు పైగా స్థానాలకు గెలుచుకుంటుందన్నారు. ఎంపీ ఎన్నికలకు గ్రామ స్థాయి నుంచి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు భట్టీ విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధుపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటివరకు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు ఇచ్చామని చెప్పారు భట్టి. మొత్తం 60 లక్షల మంది రైతులకు రైంతు బంధు అందిందని... మిగతా 5 లక్షల మందికి కూడా రైతు బంధు ఇస్తామని ఆయన తెలిపారు. రైతు బందుపై చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా జూన్ వరకు రైతు బంధు వేసిందని... అబద్దాలతో బీఆర్ఎస్ నేతలు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.