Telangana Budget : ఢిల్లీ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

Telangana Budget : ఢిల్లీ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

గత ప్రభుత్వంలో విద్యారంగం సర్వనాశనం అయ్యిందని.. విద్యారంగాన్ని  పూర్తిగా నిర్లక్ష్యం చేశారని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టీ విక్రమార్క విమర్శించారు. ఫిబ్రవరి 10వ తేదీ శనివారం అసెంబ్లీలో  భట్టీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన బడ్జెట్ పై ప్రసంగించారు.

మా ప్రభుత్వం.. రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని.. ప్రతి పేదవాడికి విద్యను అందేలా చర్యలు తీసుకుంటామని భట్టి చెప్పారు. విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ బడ్జెట్ లో రూ. 21వేల389 కోట్లు కేటాయించామని తెలిపారు.  దేశ రాజధాని ఢిల్లీ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ. 500 కోట్లను కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్ మెంట్ తోపాటు స్కాలర్ షిప్ లను సకాలంలో అందజేస్తామని చెప్పారు. ఐటీఐ కాలేజీలకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. నిరుద్యోగులకు వందశాతం ఉద్యోగాలు వచ్చేలా మా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టిందన్నారు.

రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సర్కార్ ఆలోచన చేస్తుందన్నారు భట్టి. దీని కోసం గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రల్లో  అధ్యయనంకు అధికారుల బృందాన్ని పంపిస్తామని చెప్పారు. ఓయూ తోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయించడం జరిగిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు.