సాదాబైనామాలు.. మిస్సింగ్ నంబర్లు .. రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువ ఇవే అప్లికేషన్లు

సాదాబైనామాలు.. మిస్సింగ్ నంబర్లు .. రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువ ఇవే  అప్లికేషన్లు
  • ముగిసిన సదస్సులు, వెరిఫికేషన్​ షురూ
  • ఆగస్టు 15 వరకు డెడ్​ లైన్​

జనగామ, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా సాదాబైనామాలు, మిస్సింగ్​సర్వే నంబర్లపైనే అప్లికేషన్లు వచ్చాయి. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సర్కారు తెచ్చిన భూభారతి అమలులో భాగంగా ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఈనెల 3 నుంచి 20 వరకు రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులు ముగిశాయి. దీంతో శనివారం నుంచి అప్లికేషన్ల వెరిఫికేషన్​ కసరత్తులు షురూ అయ్యాయి. అధికారుల ఫీల్డ్​ లెవల్ విచారణల తర్వాత సరైన నివేదికలతో సమస్యలకు పరిష్కారం చూపనున్నారు.

సాదాబైనామాలకు ఫుల్..​

రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వివిధ భూ సమస్యలపై అప్లికేషన్లు వెల్లువెత్తాయి. సదస్సులకు విశేష స్పందన వచ్చింది. జనగామ జిల్లాలో 176 రెవెన్యూ గ్రామాల్లో 18,929 అప్లికేషన్లు వచ్చాయి. కాగా, స్టేషన్​ఘన్​పూర్​ మండలం పైలెట్​ప్రాజెక్టుగా ఎంపిక కాగా, ఇక్కడ 13 రెవెన్యూ గ్రామాల్లో గత నెలలో సదస్సులు పూర్తి చేయగా, జిల్లాలోని మిగిలిన గ్రామాల్లో ఈనెలలో పూర్తి చేశారు. 

వీటిలో ఎక్కువగా సాదాబైనామాలు, మిస్సింగ్​సర్వే నంబర్లకు సంబంధించినవే ఉండగా, వీటి తర్వాత ప్రొహిబిటెడ్​ జాబితాలోంచి తొలగించాలని, డిజిటల్​ సైన్​పెండింగ్, అసైన్డ్​ భూములకు పట్టాలు ఇవ్వాలని, విస్తీర్ణం హెచ్చుతగ్గులపై, పాస్​ బుక్​లలో పేర్ల తప్పులు, ఆధార్​ తప్పులు, వారసత్వం వంటి సమస్యలపై అప్లై చేసుకున్నారు. వీటన్నింటినీ ఏ రోజుకారోజు ఆన్​లైన్​ చేశారు. ప్రస్తుతం సమస్యల వారీగా విభజించి ఫీల్డ్​ వెరిఫికేషన్​ చేపట్టేందుకు పనులు ప్రారంభించారు.

అప్లికేషన్ల వారీగా..

జనగామ జిల్లాలో 21,629 అప్లికేషన్​ ఫారాలను గ్రామాల్లో పంపిణీ చేయగా, బాధిత రైతులు 18,929 మంది సదస్సుల్లో తమ సమస్యలను నింపి అప్లై చేసుకున్నారు. ఇందులో సాదా బైనామాలపై 6,816, మిస్సింగ్​ సర్వే నంబర్​లకు 2959, పెండింగ్ మ్యుటేషన్లకు 1583, డిజిటల్​ సైన్​ పెండింగ్​పై 291, భూ విస్తీర్ణంలో మార్పులపై 1580, సర్వే నంబర్ల మార్పుపై 249, పాసుబుక్కులో తండ్రి, భర్త పేర్లు, ఆధార్​ తప్పులపై 142, నిషేధిత జాబితా సమస్యలపై 247, అసైన్డ్​ ల్యాండ్​సమస్యలపై 388, ఆర్​వోఆర్​ సమస్యలపై 1916 అప్లికేషన్లు వచ్చాయి. కాగా, భూ భారతి మాడ్యూల్​లో లేని రికార్డులు లేనివి, పొజిషన్​ పంచాయితీ, పార్టిషన్, హౌజ్​సైట్, అమ్ముకున్నప్పటికీ పేర్లు వచ్చినవి, ఎస్సీ కార్పోరేషన్​ల్యాండ్​లో భూమి ఇచ్చినా పట్టాలేకపోవడం తదితర ఇతర సమస్యలకు సంబంధించి 8512 అప్లికేషన్లు వచ్చాయి. 

మండలాల వారీగా జనగామలో 1044, లింగాల ఘన్​పూర్​లో 1510, బచ్చన్నపేటలో 2504,  దేవరుప్పులలో 1003, నర్మెటలో 1151, తరిగొప్పుల 1013, రఘునాథపల్లిలో 3535, చిల్పూరులో 666, జఫర్​ఘడ్​ 850, పాలకుర్తి 3619, కొడకండ్లలో 972 వచ్చాయి. వీటికి తోడు పైలెట్​ మండలం స్టేషన్​ ఘన్​పూర్​లో 1062 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తంగా 18,929 అప్లికేషన్లు రాగా, నోటీసుల సోమవారం నుంచి నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫీల్డ్​ లెవల్​లో పరిశీలించిన తర్వాత తహసీల్దార్లకు ఆపై ఆర్డీవో, అడిషనల్​కలెక్టర్, కలెక్టర్ల స్థాయిలో సమస్యలు పరిష్కరించనున్నారు.

ఆగస్టు 15 వరకు పూర్తి..

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల పరిశీలన​ స్టార్ట్​ అయింది. సోమవారం నుంచి నోటీసులు అందించి వెరిఫికేషన్ నిర్వహించనున్నాం. ఆగస్టు 15 వరకు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తాం. ఇప్పటికే ఈ విషయంపై కలెక్టర్ రిజ్వాన్​ భాషా షేక్​ ఆధ్వర్యంలో రివ్యూ నిర్వహించి, అధికారులకు దిశా నిర్దేశం చేశాం. భూభారతి ద్వారా బాధితులకు నిబంధనలకు లోబడి న్యాయం చేస్తాం.

రోహిత్​ సింగ్, అడిషనల్​ కలెక్టర్, జనగామ