
- ముగిసిన సదస్సులు, వెరిఫికేషన్ షురూ
- ఆగస్టు 15 వరకు డెడ్ లైన్
జనగామ, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా సాదాబైనామాలు, మిస్సింగ్సర్వే నంబర్లపైనే అప్లికేషన్లు వచ్చాయి. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సర్కారు తెచ్చిన భూభారతి అమలులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 3 నుంచి 20 వరకు రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులు ముగిశాయి. దీంతో శనివారం నుంచి అప్లికేషన్ల వెరిఫికేషన్ కసరత్తులు షురూ అయ్యాయి. అధికారుల ఫీల్డ్ లెవల్ విచారణల తర్వాత సరైన నివేదికలతో సమస్యలకు పరిష్కారం చూపనున్నారు.
సాదాబైనామాలకు ఫుల్..
రాష్ర్ట ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వివిధ భూ సమస్యలపై అప్లికేషన్లు వెల్లువెత్తాయి. సదస్సులకు విశేష స్పందన వచ్చింది. జనగామ జిల్లాలో 176 రెవెన్యూ గ్రామాల్లో 18,929 అప్లికేషన్లు వచ్చాయి. కాగా, స్టేషన్ఘన్పూర్ మండలం పైలెట్ప్రాజెక్టుగా ఎంపిక కాగా, ఇక్కడ 13 రెవెన్యూ గ్రామాల్లో గత నెలలో సదస్సులు పూర్తి చేయగా, జిల్లాలోని మిగిలిన గ్రామాల్లో ఈనెలలో పూర్తి చేశారు.
వీటిలో ఎక్కువగా సాదాబైనామాలు, మిస్సింగ్సర్వే నంబర్లకు సంబంధించినవే ఉండగా, వీటి తర్వాత ప్రొహిబిటెడ్ జాబితాలోంచి తొలగించాలని, డిజిటల్ సైన్పెండింగ్, అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని, విస్తీర్ణం హెచ్చుతగ్గులపై, పాస్ బుక్లలో పేర్ల తప్పులు, ఆధార్ తప్పులు, వారసత్వం వంటి సమస్యలపై అప్లై చేసుకున్నారు. వీటన్నింటినీ ఏ రోజుకారోజు ఆన్లైన్ చేశారు. ప్రస్తుతం సమస్యల వారీగా విభజించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టేందుకు పనులు ప్రారంభించారు.
అప్లికేషన్ల వారీగా..
జనగామ జిల్లాలో 21,629 అప్లికేషన్ ఫారాలను గ్రామాల్లో పంపిణీ చేయగా, బాధిత రైతులు 18,929 మంది సదస్సుల్లో తమ సమస్యలను నింపి అప్లై చేసుకున్నారు. ఇందులో సాదా బైనామాలపై 6,816, మిస్సింగ్ సర్వే నంబర్లకు 2959, పెండింగ్ మ్యుటేషన్లకు 1583, డిజిటల్ సైన్ పెండింగ్పై 291, భూ విస్తీర్ణంలో మార్పులపై 1580, సర్వే నంబర్ల మార్పుపై 249, పాసుబుక్కులో తండ్రి, భర్త పేర్లు, ఆధార్ తప్పులపై 142, నిషేధిత జాబితా సమస్యలపై 247, అసైన్డ్ ల్యాండ్సమస్యలపై 388, ఆర్వోఆర్ సమస్యలపై 1916 అప్లికేషన్లు వచ్చాయి. కాగా, భూ భారతి మాడ్యూల్లో లేని రికార్డులు లేనివి, పొజిషన్ పంచాయితీ, పార్టిషన్, హౌజ్సైట్, అమ్ముకున్నప్పటికీ పేర్లు వచ్చినవి, ఎస్సీ కార్పోరేషన్ల్యాండ్లో భూమి ఇచ్చినా పట్టాలేకపోవడం తదితర ఇతర సమస్యలకు సంబంధించి 8512 అప్లికేషన్లు వచ్చాయి.
మండలాల వారీగా జనగామలో 1044, లింగాల ఘన్పూర్లో 1510, బచ్చన్నపేటలో 2504, దేవరుప్పులలో 1003, నర్మెటలో 1151, తరిగొప్పుల 1013, రఘునాథపల్లిలో 3535, చిల్పూరులో 666, జఫర్ఘడ్ 850, పాలకుర్తి 3619, కొడకండ్లలో 972 వచ్చాయి. వీటికి తోడు పైలెట్ మండలం స్టేషన్ ఘన్పూర్లో 1062 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తంగా 18,929 అప్లికేషన్లు రాగా, నోటీసుల సోమవారం నుంచి నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫీల్డ్ లెవల్లో పరిశీలించిన తర్వాత తహసీల్దార్లకు ఆపై ఆర్డీవో, అడిషనల్కలెక్టర్, కలెక్టర్ల స్థాయిలో సమస్యలు పరిష్కరించనున్నారు.
ఆగస్టు 15 వరకు పూర్తి..
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల పరిశీలన స్టార్ట్ అయింది. సోమవారం నుంచి నోటీసులు అందించి వెరిఫికేషన్ నిర్వహించనున్నాం. ఆగస్టు 15 వరకు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తాం. ఇప్పటికే ఈ విషయంపై కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆధ్వర్యంలో రివ్యూ నిర్వహించి, అధికారులకు దిశా నిర్దేశం చేశాం. భూభారతి ద్వారా బాధితులకు నిబంధనలకు లోబడి న్యాయం చేస్తాం.
రోహిత్ సింగ్, అడిషనల్ కలెక్టర్, జనగామ