- విజయంపై ఇటు ఎన్డీయే, అటు మహాఘట్బంధన్ ధీమా
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు జరగగా.. రిజల్ట్స్పై అన్ని పార్టీలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ఎగ్జిట్పోల్స్ ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చినప్పటికీ.. ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు మాత్రం తమకే అనుకూలంగా ఉంటాయని మహాఘట్బంధన్ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నది. ఓట్ల లెక్కింపు కోసం 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వోలు), 243 మంది కౌంటింగ్ ఆబ్జర్వర్స్డ్యూటీలో ఉంటారని ఎలక్షన్ కమిషన్ గురువారం తెలిపింది.
అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ కొనసాగుతుందని పేర్కొంది. మొత్తం 4,372 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతి టేబుల్కు కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారని వివరించింది. అభ్యర్థుల తరఫున దాదాపు 18 వేల మంది కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారని పేర్కొంది.
రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన
ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కి స్తారు. ఆ తర్వాత అరగంటకు అంటే 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను ఫామ్ 17సీలోని ఎంట్రీలతో సరిపోలుస్తారు. తేడా ఉంటే.. వీవీప్యాట్ స్లిప్పులనూ లెక్కిస్తారు. ఇందుకోసం సెగ్మెంట్లోని ర్యాండమ్గా ఐదు పోలింగ్ స్టేషన్స్లోని వీవీప్యాట్లను సెలెక్ట్ చేసుకుంటారు.
ఫలితాలను రౌండ్ల వారీగా రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రకటిస్తారు. ఎప్పటికప్పుడు ఈసీ వెబ్సైట్లో ఉంచుతారు. తాము అధికారికంగా ప్రకటించే ఫలితాలను మాత్రమే నమ్మాలని, వాటినే జనానికి చేరవేయాలని మీడియాకు ఈసీ సూచించింది.
ట్రక్కు కలకలం
రోహ్తాస్లోని కౌంటింగ్ సెంటర్కు ఈవీఎంలతో కూడిన ట్రక్కు వెళ్లిందంటూ ఆర్జేడీ ఆరోపణలు గుప్పించింది. దీనిపై నిరసనలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం) మాట్లాడుతూ.. ‘‘కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన ట్రక్కులో ఖాళీ స్టీల్ పెట్టెలు మాత్రమే ఉన్నాయి. అందరి సమక్షంలో వాటిని తనిఖీ చేశాం. ఆ ట్రక్కు స్ట్రాంగ్ రూమ్కు దాదాపు 500 మీటర్ల దూరంలో పార్క్ చేసి ఉంది” అని పేర్కొన్నారు. అవాస్తవాలను నమ్మొద్దని సూచించారు.
