బీహార్ ముఖియా గ్యాంగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ నగల వ్యాపారి ఇంట్లో 2.5 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు నగల చోరీ
ఇండ్లలో పని మనుషులుగా చేరి దొంగతనాలు
బంగారం, డైమండ్స్ టార్గెట్గా లూటీలు
దేశమంతటా 50కిపైగా చోరీలు
అదుపులో ఐదుగురు.. పరారీలో ఒకడు
పని మనుషుల్లా ఇండ్లల్లో చేరతారు. మంచోళ్లలా యజమానులను నమ్మిస్తారు. అదును చూసి డబ్బు, నగలు దోచేసి ఉడాయిస్తారు. దోచిన సొత్తును గోడల్లో దాచేస్తారు. ఇదీ బీహార్ ముఖియా గ్యాంగ్ చోరీల తీరు. డబ్బున్నోళ్ల ఇళ్లనే టార్గెట్ చేస్తున్న ఆ దొంగల ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఆరుగురు సభ్యుల ముఠాలోని నలుగురిని అరెస్ట్ చేసి రూ.2.5 కోట్ల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పని మనుషులుగా చేరి దేశవ్యాప్తంగా 50 చోరీలకు పాల్పడిన ముఖియా గ్యాంగ్ వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
అడ్డు తగిలితే చంపేందుకూ వెనకాడరు
భగవత్ ముఖియా (32).. సొంతూరు బీహార్ మధుబని జిల్లాలోని నిర్భాపూర్. ఇండ్లలో వంట మనిషిగా చేరి యజమానుల కళ్లుగప్పి చోరీలకు పాల్పడేవాడు. అదే ప్రాంతానికి చెందిన రామ్ ఆశిష్ ముఖియా అలియాస్ కరన్, రాహుల్ ముఖియా, పీతాంబర్ మండల్, భోలా ముఖియా, హరిశ్చంద్ర ముఖియాతో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. గ్యాంగ్ను భోలా ముఖియా లీడ్ చేసేవాడు. డబ్బున్నోళ్ల ఇండ్లలో పనిచేసేందుకు వంట మనిషి, కార్ డ్రైవర్, స్వీపర్, కేర్టేకర్ వంటి వాళ్లను సప్లై చేసే ఏజెంట్గా అవతారమెత్తాడు. దేశంలోని మెట్రో సిటీలతో పాటు హర్యానా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో సంపన్నులను టార్గెట్ చేశాడు. 2005 నుంచి ఢిల్లీ, చెన్నై, పాట్నాల్లో చోరీలకు పాల్పడ్డారు. అక్కడి పోలీస్ రికార్డుల్లో మోస్ట్ వాంటెడ్ దొంగల లిస్టులో చేరారు. నిర్భాపూర్కు చెందిన దాదాపు 20 మంది ఆ లిస్టులో ఉన్నారు. చోరీ చేసేటప్పుడు ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే దాడి చేసే హతమార్చేందుకూ ముఖియా గ్యాంగ్ వెనకాడదు. పోలీసులు పట్టుకున్నా దొంగిలించిన సొమ్ము దొరక్కుండా ఇండ్ల గోడల్లో దాచేస్తుంది. స్టేషన్ నుంచి బయటికొచ్చాక వాటిని బయటకు తీసి అమ్మేస్తుంది. తర్వాత మళ్లీ యథావిధిగా పక్క దేశం నేపాల్తో పాటు వేరే సిటీల్లో దొంగతనాలకు స్కెచ్ వేస్తుంది.
45 రోజుల మఫ్టీలో..
నిరుడు అక్టోబర్లో హైదరాబాద్ను టార్గెట్ చేసింది భగవత్ ముఖియా గ్యాంగ్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్12లోని నగల వ్యాపారి కపిల్ గుప్తాను ట్రాప్ చేసింది. అతడి ఇంట్లో రామ్ ఆశిష్ ముఖియాను వంట మనిషిగా చేర్పించాడు భోలా. ఇంట్లో బంగారం, డబ్బు దాచే సీక్రెట్ లాకర్లు, వాటి తాళాలుండే ప్లేస్లను రామ్ ఆశిష్ ముఖియా గుర్తించాడు. డిసెంబర్ 8న హైదరాబాద్ శంషాబాద్లో జరిగే దగ్గరి బంధువుల పెళ్లికి వెళ్లింది కపిల్ గుప్తా కుటుంబం. ఆ రోజు అర్ధరాత్రి టైంలో ముఖియా గ్యాంగ్ చోరీ చేసింది. రూ.కోటిన్నర విలువైన వజ్రాలతో పాటు, కోటి రూపాయల విలువైన ఆభరణాలను దొంగిలించి బీహార్ పారిపోయింది. తెల్లారి ఇంటికి వచ్చిన కపిల్ గుప్తా, చోరీ జరిగిన విషయం తెలుసుకున్నాడు. వంటమనిషిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీపీ కె.ఎస్. రావు ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ టీం కేసు దర్యాప్తును మొదలుపెట్టింది. రామ్ ఆశిష్ ముఖియా ఫోన్ నంబర్ను ట్రాక్ చేసి బీహార్లో ఉన్నట్టు తేల్చింది. మధుబని జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఆంధ్రటాడి సిజౌలి, నిర్భాపూర్, హుస్సేన్ పూర్, కొథియా, బిరాల్లో ముఖియా గ్యాంగ్ ఉన్నట్టు గుర్తించింది. అయితే, అప్పటికే తప్పించుకు పారిపోయిన రామ్ ఆశిష్ ముఖియా, దోచిన సొత్తును గోడల్లో దాచి మహిళలను కాపలాగా పెట్టిపోయాడు. ఎవరైనా వస్తే తుపాకులు, కత్తులతో దాడి చేసేలా స్థానిక యువకులను ఏర్పాటు చేశాడు. అయితే, వాళ్లను పట్టుకునేందుకు రవికుమార్ టీం 45 రోజుల పాటు మారువేషాల్లో నిఘా పెట్టింది. గత నెలలో భగవత్ ముఖియా, భోలా ముఖియా, హరిశ్చంద్ర ముఖియాను అరెస్ట్ చేసింది. గోడల్లో దాచిన సొత్తును స్వాధీనం చేసుకుంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రామ్ ఆశిష్ ముఖియాను బుధవారం అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న రాహుల్ ముఖియా, పీతాంబర్ మండల్ కోసం
వెతుకుతోంది.
హాక్ఐ యాప్ను వాడండి
ఇలాంటి చోరీలు జరగకుండా ప్రజలు హాక్ ఐ యాప్ను వాడుకోవాలి. పనిమనిషి వెరిఫికేషన్తో పాటు, ఇండ్లల్లో రెంట్కు వచ్చే వాళ్ల వివరాల వెరిఫికేషన్ కోసం హాక్ఐ యాప్లో రిక్వెస్ట్ పెట్టాలి. మా దగ్గరున్న డేటా ఆధారంగా పనివాళ్ల చరిత్ర తెలుసు కుంటాం. దీంతో చోరీలు జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్ చేసే వీలుంటుంది.
– అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ