డంప్ యార్డులో బయో మైనింగ్ కంప్లీట్.. ఎట్టకేలకు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసెసింగ్

డంప్ యార్డులో బయో మైనింగ్ కంప్లీట్.. ఎట్టకేలకు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసెసింగ్
  • ఎరువుగా మార్చి వివిధ అవసరాలకు తరలింపు
  • దాదాపు 17 ఎకరాల స్థలం ఖాళీ
  • యార్డులో మరో 4 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వ్యర్థాలు
  • మడికొండ గ్రామస్థుల ఉద్యమంతో వేస్ట్ మేనేజ్మెంట్ స్పీడప్

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరానికి గండంగా మారిన మడికొండ డంప్ యార్డులో చెత్త గుట్టలు కరుగుతున్నాయి. మూడున్నరేండ్ల కిందట డంపింగ్ యార్డులో చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించిన మేర చెత్త ప్రాసెసింగ్ పూర్తి కాగా, తొందర్లోనే ఇక్కడ బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే డంప్ యార్డును తరలించాలని మడికొండ, రాంపూర్ గ్రామస్తులు దాదాపు ఆరు నెలల నుంచి ఉద్యమం నడిపిస్తుండగా, తొందర్లోనే సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం దొరుకుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.

3.75 లక్షల మెట్రిక్ టన్నులు., మూడున్నరేండ్లు

గ్రేటర్​ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 66 డివిజన్ల పరిధిలో 2.5 లక్షల ఇండ్లు, 11 లక్షల వరకు జనాభా ఉంది. నిత్యం 450 మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతుండగా, అంతా మడికొండ, రాంపూర్ గ్రామాల సమీపంలో సుమారు 32 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ (డంపింగ్ యార్డు)కు తరలిస్తున్నారు. గతంలో చెత్త ప్రాసెసింగ్ కు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వ్యర్థాలు పేరుకుపోయాయి.

దీంతో స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా రూ.37 కోట్లతో మడికొండ డంపింగ్ యార్డులో బయో మైనింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాల శుద్ధీకరణకు బల్దియా టెండర్లు పిలవగా, కోయంబత్తూరుకు చెందిన లీప్ ఎకోటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ కు చెందిన మరో సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వగా, ఆ సంస్థ 2021 డిసెంబర్ లో పనులు స్టార్ట్ చేసింది.

జీడబ్ల్యూఎంసీ టార్గెట్ ప్రకారం ఏడాదిలోనే బయో మైనింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ, గత ప్రభుత్వం సరైన టైంలో బడ్జెట్ రిలీజ్ చేయకపోవడం, వర్షాలు, మిషనరీ చోరీ జరగడం, సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ మధ్యలోనే చేతులెత్తేయడం, తదితర కారణాల ప్రాసెసింగ్ నత్తనడకన సాగింది. దీంతో దాదాపు మూడున్నరేండ్లు పనులు కొనసాగగా, ఎట్టకేలకు వారం రోజుల కిందట పూర్తయ్యింది.

ఒప్పందం మేరకు లీప్ ఎకోటెక్ సంస్థ 3.75 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించి, రాళ్లు పోనూ మిగతా 40 శాతం చెత్తను ఎరువుగా మార్చింది. కానీ, రైతులెవరూ ముందుకు రాకపోవడం, మున్సిపల్ ఆఫీసర్లు అవగాహన కల్పించకపోవడంతో ఆ ఎరువునంతా నగరవాసుల అవసరాలకు తరలించారు. దీంతో దాదాపు 17 ఎకరాల మేర స్థలం ఖాళీ కాగా, కాంట్రాక్టు సంస్థ రెండు, మూడు రోజుల్లో స్థలాన్ని బల్దియాకు అప్పగించనుంది.

తొందర్లోనే బయో మిథనైజేషన్

మడికొండ డంప్ యార్డులో బయో మైనింగ్ పూర్తి కాగా, రోజురోజుకూ వెలువడుతున్న కొత్త చెత్తతో మళ్లీ 4 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వ్యర్థాలు పోగయ్యాయి. డైలీ ఉత్పత్తవుతున్న చెత్తతో మళ్లీ డంప్ యార్డు నిండుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా వరంగల్ నగరాన్ని గోబర్ ధన్ స్కీంకు ఎంపిక చేసింది. ఇందులో భాగంగా మడికొండ డంప్ యార్డులో బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి రోజు 20 టన్నుల చెత్తను ఇక్కడ రీసైకిల్ చేసి కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ)గా మారుస్తారు. డిజైన్, బిల్ట్, ఫంక్షన్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్ (డీబీఎఫ్ఓటీ) విధానంలో దీనిని ఏర్పాటు చేయనుండగా, దాదాపు 25 ఏండ్ల కాలానికి లీజుకు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ తర్వాత బయో మిథనైజేషన్ ప్లాంట్ లో ఉత్పత్తయ్యే గ్యాస్ ను మార్కెట్ లో విక్రయించనున్నారు. దీంతో బల్దియాకు ఆదాయం సమకూరడంతోపాటు డంప్ యార్డును గ్రీన్ బఫర్ జోన్ గా ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు ప్రక్రియ టెండర్ దశలో ఉందని అధికారులు చెబుతున్నారు.

డంప్ యార్డును తరలించాలని ఉద్యమం..

డంప్ యార్డు నుంచి వచ్చే పొగ, ఘాటు, దుర్వాసనతో మడికొండ, రాంపూర్, ఎలుకుర్తి, మోడల్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు, ఆఫీసర్లకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో డంప్ యార్డును తరలించాలనే డిమాండ్ తో మడికొండ గ్రామస్తులు ఈ ఏడాది జనవరి 19 నుంచి ఉద్యమం స్టార్ట్ చేశారు. కమిటీ ఏర్పాటు చేసుకుని, ఆఫీసర్లు, లీడర్లకు విన్నవించడంతోపాటు ఆందోళనలు షురూ చేశారు.

దీంతో జీడబ్ల్యూఎంసీ అధికారులు డంప్ యార్డు ప్రక్షాళనను స్పీడప్ చేశారు. బయో మైనింగ్ పూర్తి చేయించి, 20 టీపీడీ బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వీటితో పాటు హుజురాబాద్ సమీపంలో వేస్ట్ టు ఎనర్జీ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటైతే వరంగల్ నగరానికి డంపింగ్ యార్డు కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు. కానీ, మడికొండ, రాంపూర్ గ్రామస్తులు మాత్రం గాలి, నీళ్లు కలుషితం అవుతున్నాయని, డంప్ యార్డును తరలించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.