బర్డ్ ఫ్లూ వ్యాప్తికి రైతులు కారణమా?.. బీజేపీపై శివసేన ఫైర్

బర్డ్ ఫ్లూ వ్యాప్తికి రైతులు కారణమా?.. బీజేపీపై శివసేన ఫైర్

ముంబై: బర్డ్ ఫ్లూ వ్యాప్తికి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులు కారణమంటూ బీజేపీ నేతలు అనడంపై శివసేన పార్టీ మండిపడింది. బీజేపీని విమర్శిస్తూ శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురించింది. రైతులను పాకిస్తాన్, ఖలిస్థాన్, నక్సలైట్లుగా ముద్ర వేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది.

‘కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో బర్డ్ ఫ్లూ సమస్య మొదలైంది. రైతుల నిరసనల వెనుక పాకిస్థానీ, ఖలిస్థానీ, చైనీస్, నక్సలైట్లు, మావోయిస్టులు ఉన్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే కోళ్లు, పక్షుల అనుమానిత మృతి వెనుక ఈ ఖలిస్థానీ, పాకిస్థానీ, నక్సలైట్స్ హస్తం ఉందా లేదా అనేది బీజేపీ అధికార ప్రతినిధి ఎందుకు వెల్లడించడం లేదు?’ అని సామ్నాలో శివ సేన ప్రశ్నించింది.