జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు బీజేపీ ఆందోళన.. లోపలకు వెళ్లి కమిషనర్ను కలిసే ప్రయత్నం

జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు బీజేపీ ఆందోళన.. లోపలకు వెళ్లి కమిషనర్ను కలిసే ప్రయత్నం
  • నగర సమస్యల పరిష్కారం కోసం నిరసన
  • అడ్డుకున్న పోలీసులు
  • 10 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామన్న కమిషనర్​
  • 15 రోజులు టైం ఇచ్చిన బీజేపీ  

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఆధ్యర్యంలో బల్దియా హెడ్డాఫీసు వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. స్ట్రీట్ లైట్లు, రోడ్ల సమస్య, వర్షాకాలం వచ్చినా నాలాల పూడిక తీయడం లేదని, డివిజన్లలో సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ ​చేశారు.

ఈ సందర్భంగా ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించిన బీజేపీ కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులను  మోహరించారు. బీజేపీ లీడర్లు, కార్పొరేటర్లు కమిషనర్‌‌‌‌‌‌‌‌ను కలుస్తామనడంతో 15 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అందరం వెళ్తామని పట్టుబట్టడంతో అనుమతి ఇవ్వలేదు.

దీంతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు గేట్లు ఎక్కి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా అక్కడే బైఠాయించారు. చివరకు కమిషనర్​ కలవడానికి ఒప్పుకోవడంతో కొద్దిమంది బీజేపీ లీడర్లు, కార్పొరేటర్లు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు.  పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు,  మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ కమిషనర్​పదిరోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, తాము 15 రోజులు టైం ఇస్తున్నామని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. మాజీమంత్రి కృష్ణయాదవ్, కార్పొరేటర్లు  రవిచారి,  అమృత, శ్రవణ్ ఉన్నారు.

కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్
బీజేపీ లీడర్లు, కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు కాదని, ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరం నుంచి ఎంపీగా గెలిచి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు. అందుకే కిషన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేయాలని, ఆ ధర్నాలో పాల్గొనేందుకు తాము కూడా వస్తామన్నారు.