బీజేపీ కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి చేస్తలేరని మున్సిపాలిటీకి తాళం

బీజేపీ కౌన్సిలర్ల వార్డుల్లో అభివృద్ధి చేస్తలేరని మున్సిపాలిటీకి తాళం

కొత్తకోట, వెలుగు: వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ ఆఫీసుకు బీజేపీ కౌన్సిలర్​ భరత్​ భూషణ్​ తాళం వేసి ఆందోళనకు దిగారు. 11వ వార్డులో కనీస సౌలతులు కల్పించడం లేదని ఆరోపిస్తూ మున్సిపల్​ ఆఫీస్​ తాళం తీయనివ్వకుండా మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. మున్సిపల్​ సిబ్బందిని ఆఫీసులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భరత్ భూషణ్ మాట్లాడుతూ.. 11వ వార్డులో హైమాస్ట్​ లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్​కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పారు. వార్డుకు వచ్చిన లైట్లను మున్సిపల్ చైర్​పర్సన్ ​సుఖేషిని జోక్యం చేసుకొని మరో వార్డులో  వేయించారని ఆరోపించారు. 

ఎన్నికల్లో గెలిచి మూడేండ్లైనా తన వార్డులో అభివృద్ధి జరగకుండా మున్సిపల్ చైర్​పర్సన్​ కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్​కు చెందిన కౌన్సిలర్ల వార్డులను డెవలప్ చేస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఉన్న వార్డులను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ కౌన్సిలర్లు ఉన్న వార్డుల్లో అభివృద్ధి పనులు జరిగేంతవరకు మున్సిపల్ ఆఫీస్ తాళం తీయనివ్వమని పేర్కొన్నారు. కమిషనర్ శ్రీనివాసులు అక్కడికి చేరుకొని కౌన్సిల్​ మీటింగ్​లో నిలదీసి పనులు చేయించుకోవాలని సూచించారు. ఇలా ఆఫీస్​కు తాళం వేయడం సరి కాదన్నారు. వార్డులో అభివృద్ధి పనులు చేయించే బాధ్యత తీసుకుంటానని కమిషనర్​ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీజేపీ కౌన్సిలర్​ నవీన్​రెడ్డి, బీజేపీ నాయకులు ఎస్​.వెంకట్​రెడ్డి, మన్యం యాదవ్, అమరేందర్​రెడ్డి పాల్గొన్నారు.