సోనియాపై బీజేపీ ఫిర్యాదు

సోనియాపై బీజేపీ ఫిర్యాదు

బెంగళూరు/న్యూఢిల్లీ:  ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కర్నాటక సార్వభౌత్వాన్ని కాపాడుతామంటూ కామెంట్లు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమెపై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. సోమవారం ఈ మేరకు ఢిల్లీలోని ఎన్నికల సంఘం ఆఫీసులో భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రతినిధుల బృందం మెమొరాండం సమర్పించింది. కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌‌కు సంబంధించిన ఫొటో కాపీని కూడా ఫిర్యాదుకు జత చేసింది. ‘‘ఇండియాలో కర్నాటక ముఖ్యమైన రాష్ట్రం. దేశంలోని ఓ రాష్ట్రం సార్వభౌమత్వాన్ని కాపాడుతామని అంటున్నారంటే.. దాని అర్థం విభజనకు పిలుపునివ్వడమే. ఇది ప్రమాదకరమైన, వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది” అని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ గుర్తింపును రద్దు చేయాలని పార్టీ సీనియర్ నేత తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. మరోవైపు బెంగళూరులో కూడా ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.  

ఆమోదయోగ్యం కాదు

‘‘ఒక దేశం స్వతంత్రం పొందితే.. దాన్ని సార్వభౌమ దేశమని అంటాం. ఇండియా సార్వభౌమ దేశం. అందులో కర్నాటక.. గర్వించదగిన భాగం. ఇప్పటిదాకా కన్నడిగుల సమగ్రత గురించి ఏ ఒక్కరూ ప్రశ్నించలేదు. ఇండియాలో కర్నాటక భాగం కాదని, వేరు అని కాంగ్రెస్ విశ్వసిస్తున్నట్లుగా ఉంది. పౌరులను విభజించడం, రాష్ట్రాల ప్రజల మధ్య చీలికను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుని వ్యాఖ్యలు చేసినట్లుంది. కర్నాటక.. భారతదేశానికి భిన్నమైనది కాదు” అని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. సోనియా వ్యాఖ్యలు షాకింగ్ అని, ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే చెప్పారు. ఎన్నికల నియమావళిని సోనియా ఉల్లంఘించారని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమెపై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

సోనియా గాంధీ వ్యాఖ్యలపై  క్లారిటీ ఇవ్వండి: ఎన్నికల సంఘం

కర్నాటక సార్వభౌమత్వాన్ని కాపాడుతామంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29ఏ (5) ప్రకారం రాజకీయ పార్టీలు చేసిన తప్పనిసరి ప్రమాణాన్ని సదరు ట్వీట్ ద్వారా కాంగ్రెస్ ఉల్లంఘించిందని బీజేపీ చేసిన ఫిర్యాదును ప్రస్తావించింది. ‘‘కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఉంచిన, కాంగ్రెస్ సీపీపీ చైర్ పర్సన్‌ (సోనియా)కు ఆపాదించిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వండి. సరిదిద్దడానికి చర్యలు తీసుకోండి” అని ఈసీ సూచించింది.