
గ్రౌండ్ లెవల్ కేడర్ నుంచి స్టేట్ లెవల్ లీడర్షిప్ దాకా అంతా అక్కడే
సిద్దిపేట ఇన్సిడెంట్తో ఒక్కతాటిపైకి కమలదళం
సభలు, సమావేశాలు, రోడ్షోలతో జనంలోకి
టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ను ఎండగడుతున్న నేతలు
జనం నుంచి మంచి స్పందన
హైదరాబాద్, వెలుగు: దుబ్బాక ఉప ఎన్నికను సవాల్గా తీసుకున్న బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నది. సిద్దిపేట ఇన్సిడెంట్తో కమలం నేతలు, కార్యకర్తలు అంతా ఒక్కటయ్యారు. గ్రౌండ్ లెవల్ కేడర్ నుంచి స్టేట్ లెవల్ లీడర్షిప్ దాకా అందరూ బై ఎలక్షన్ మీదే స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న కసి వారిలో కనిపిస్తున్నది. వారం రోజులుగా నియోజకవర్గంలోని ప్రతి చోటా సభలు, సమావేశాలు, రోడ్షోలు నిర్వహిస్తున్నారు. అన్ని సంఘాల నేతలు, యువత, మహిళలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ముఖ్య నేతలందరూ ప్రచారంలో పాల్గొంటుండటం కేడర్లో జోష్ను పెంచుతున్నది. ఇతర ప్రాంతాల కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా దుబ్బాకకు వచ్చి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి.. తమ అభ్యర్థి రఘునందన్రావుకు ఓటు వేయాలని కోరుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, బాపూరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, జితేందర్రెడ్డి, బాబూమోహన్తో పాటు ఇతర నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్యూర్స్ను ఎండగడుతున్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం సహా ఆరేండ్లలో అమలు కాని టీఆర్ఎస్ హామీలను ఓటర్లకు వివరిస్తున్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారంటూ లెక్కలతో వెల్లడిస్తున్నారు. అదే టైంలో ప్రధాని మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను, రాష్ట్ర పథకాల్లో కేంద్రం వాటాను ఇంటింటికి వెళ్లి చెప్తున్నారు. టీఆర్ఎస్ విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు. దీంతో ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుండటం బీజేపీ కేడర్లో నూతనోత్సాహం నింపుతున్నది. పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుకు దుబ్బాకతో మంచి అనుబంధం ఉండటం, ఏ టైంలోనైనా జనానికి అందుబాటులో ఉంటారన్న పేరు ఉండటం, గతంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతికి తోడు మోడీ పాలనపై ప్రజల్లో ఉన్న సానుకూలత బై ఎలక్షన్లో కలిసి వస్తుందని, తమదే గెలుపని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు.
సిద్దిపేట ఇన్సిడెంట్తో పెరిగిన హీట్
వారం కిందట సిద్దిపేటలో రఘునందన్రావు బంధువులు, ఇతరుల ఇండ్లపై పోలీసులు చేపట్టిన సోదాలు, ఈ సందర్భంగా తలెత్తిన వివాదాలు, లాఠీచార్జ్, అరెస్టులు తీవ్ర దుమారం రేపాయి. అక్కడికి వెళ్లిన తనపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ దీక్షకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ పరిణామాలతో దుబ్బాక ఉప ఎన్నిక హీట్ రాష్ట్రానికంతటికీ పాకింది. కావాలనే టీఆర్ఎస్ తమను బద్నాం చేయాలని చూస్తున్నదని, ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదల బీజేపీ నేతల్లో పెరిగింది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని, ఇక్కడి పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు కూడా చేసింది. పరిస్థితులను గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడుకు చెందిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సరోజ్ కుమార్ ఠాకూర్ ను దుబ్బాక బై ఎలక్షన్లో పోలీస్ అబ్జర్వర్గా నియమించింది.
పకడ్బందీగా ముందుకు…
దుబ్బాక బై ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతోనే బీజేపీ అలర్ట్ అయింది. నియోజకవర్గానికి పార్టీ తరఫున కో ఆర్డినేటర్ గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని నియమించడంతో పాటు, ఇక్కడ మండలాల వారీగా పార్టీ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది. టీఆర్ఎస్సే తమ అసలైన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తూ.. ప్రత్యేక సభలు, సమావేశాలు పెడుతూ కీలక నేతలతో ప్రచారం చేయిస్తూ వచ్చింది. నామినేషన్లు ముగిసిన తర్వాత ప్రచారాన్ని మరింత పెంచింది. యూత్, మహిళల ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రోజురోజుకు బీజేపీ పట్టు సాధిస్తుండడం.. గెలుపుపై ధీమాగా ఉన్న టీఆర్ఎస్లో గుబులు పుట్టిస్తోందని జనంలో చర్చ జరుగుతున్నది. టీఆర్ఎస్ లీడర్లు కూడా బీజేపీనే రాజకీయ ప్రత్యర్థిగా చూస్తూ ప్రచారం చేస్తున్నారు.
దుబ్బాక బైఎలక్షన్తో రాష్ట్ర ఫ్యూచర్ టర్న్ అయితది.. కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో బందీగా మారిన తెలంగాణను విడిపించే తీర్పు రాబోతుంది. ఆరేండ్ల లో అప్పులు, అవినీతి, లిక్కర్ సేల్స్, కుటుంబ పాలన, పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగంలో మాత్రమే రాష్ట్రం డెవలప్ అయింది. ఇన్నేండ్లు దుబ్బాకను పట్టించుకోని టీఆర్ఎస్ సర్కారు.. అబద్ధపు హామీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. పోలీసులతో బీజేపీ కార్యకర్తలను అణచివేయాలని చూస్తే ఊరుకోం.
– దుబ్బాక ప్రచార సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి