హైదరాబాద్ ను యూటీ చేయాలన్న ఆలోచన లేదు

హైదరాబాద్ ను యూటీ చేయాలన్న ఆలోచన లేదు

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేస్తుందని భావిస్తే… ఈ రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్. కరీంనగర్ లోని హోటల్ మైత్రీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ లో గ్రానైట్, ఇసుక మాఫియా సహజ సంపదను దోచేస్తోందని అన్నారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని.. దేశమంతటా జరిగిన ఓ సర్వేలో తేలిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు. 70 శాతం ప్రజలకు… డబ్బులు ముట్టజెప్పందే పని కావడం లేదన్నారు. ప్రాజెక్టుల్లో కమీషన్ల రూపంలో వచ్చిన అవినీతి డబ్బును ఎన్నికల్లో ఉపయోగించారనీ.. పేదల సంక్షేమం స్కీంలన్నింటిలోనూ స్కాంలే ఉన్నాయన్నారు. చంద్రబాబును బూచిగా చూపి అధికారంలోకి వచ్చారని విమర్శించారు లక్ష్మణ్.

జనం ప్రాణాలతో ఆటలు

రూ.1500 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టే.. హాస్పిటళ్లలో వైద్య సేవలు నిలిచిపోయాయన్నారు లక్ష్మణ్. సెక్రటేరియట్ కూల్చి రూ.500 కోట్లు ఖర్చు చేస్తామంటున్న ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం అక్కర లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో చీకటి రాజ్యం నడుస్తోందన్నారు. సమాచార హక్కును   కాలరాసే విధంగా 1457 జీవోలను వెబ్ సైట్ లో ఉంచడం లేదన్నారు. అధికార టీఆర్ఎస్ భవనాల కోసం ప్రభుత్వ భూములను ఎకరా రూ.100 చొప్పు అప్పనంగా కట్టబెట్టారని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాళేశ్వరంపై పూర్తి డీపీఆర్ లేకుండానే రంగుల సినిమా చూపిస్తున్నారని అన్నారు.

విద్యారంగాన్ని భ్రష్టుపట్టించారు

ఎంసెట్, ఇంటర్ పరీక్షల నిర్వహణ తప్పుల తడకగా మారిందన్న లక్ష్మణ్.. 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కేంద్రం నివేదిక అడిగితే… సీఎం కేసీఆర్ అది పెద్ద కుట్ర అంటున్నారని అన్నారు. గ్లోబరినాపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 16 మంది సీఎంలు చేసిన అప్పు రూ.62 వేల కోట్లైతే ఒక్క కేసీఆర్ రూ.2 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. టీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమ గీతం పాడాల్సి ఉందన్నారు. ఇందుకు బీజేపీ వేదికగా భావించి చాలా మంది పార్టీలో చేరారన్నారు.

మాజీ ప్రభుత్వ సలహాదారు… మా పార్టీలో చేరాక ఔట్ డేటెడ్ అయ్యారా.. 

వివేక్ కు టీఆర్ఎస్ ప్రభుత్వ సలహదారుగా పెట్టుకున్నారని గుర్తుచేసిన లక్ష్మణ్… తమ పార్టీలోకి వస్తే.. ఔట్ డెేటెడ్ అంటారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ను సమర్ధిస్తేనే తెలంగాణ వాదులు అనడం కరెక్ట్ కాదన్నారు. పరమత సహనం గురించి కేటీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు లక్ష్మణ్. మోడీ బొమ్మ పెట్టాల్సివస్తోందనే ఆయుస్మాన్ భారత్ అమలు చేయడం లేదన్నారు. ఫసల్ బీమా, ఆవాస్ యోజన లాంటివి తెలంగాణలో అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం జాతీయ హోదాపై ఇప్పటి వరకు డీపీఆర్ ఇవ్వలేదనీ.. కేంద్రం నిఘా ఉంటే కమీషన్లు రావని వాళ్లు భయపడుతున్నారని విమర్శించారు.

“సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ దినం. తెలంగాణ విలీన దినాన్ని సీఎం తొక్కి పెడుతున్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై చర్యలు తప్పవు.  ఆర్టికల్ 370 రద్దు చేసినట్లుగానే.. తెలంగాణ విమోచన జరిపి తీరుతాం. హైదరాబాద్ ను యూటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అది ఎంతమాత్రం నిజం కాదు. హైదరాబాద్ ను యూటీ చేయం. బీజేపీలో పాత, కొత్త నేతలమంతా కలిసి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తాం. టీఆర్ఎస్ మరిచిన… విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తాం” అన్నారు లక్ష్మణ్.